అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుక్షాకాంక్షలు తెలిపారు. కర్నాటక మైసూరులో జరిగిన యోగా దినోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని…యోగాతో సమాజంలో శాంతి చేకూరుతుందన్నారు. “ఈ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో యోగా సాధన జరుగుతోంది. యోగా మనకు శాంతిని కలిగిస్తుంది. యోగా వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రమే కాదు, మన దేశాలకు, అలాగే ప్రపంచానికి కూడా శాంతిని కలిగిస్తుంది” అని అన్నారు. మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్లో జరిగిన యోగా వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు 15 వేల మందికి పైగా యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. యోగా ఏ ఒక్కరికో కాక…యావత్ మానవాళికి మేలు చేస్తుందని…అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ అని ప్రధాని అన్నారు.
ఈ సంవత్సరం యోగా దినోత్సవ థీమ్ “యోగా ఫర్ హ్యుమానిటీ” అని చాలా చర్చలు,సంప్రదింపుల తర్వాత థీమ్ ఎంపిక చేశారన్న ప్రధాని… కోవిడ్-19 మహమ్మారి విజృభిస్తున్న సమయంలో దాని ప్రభావాన్ని తగ్గించడంలో యోగా మానవాళికి ఎలా ఉపయోగపడిందో అందరికీ తెలిసిందేనని అన్నారు. .
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా… కేంద్ర మంత్రులు 75 ప్రాంతాల్లో యోగావేడుకల్లో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది ఆయుష్ మంత్రిత్వ శాఖ.