తెలంగాణాలో రామగుండం NTPC వద్ద 100 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. “ఉజ్వల్ భారత్ – ఉజ్వల్ భవిష్య-పవర్ @2047” ముగింపు కార్యక్రమంలో భాగంగా, ప్రధాని ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. భారతదేశంలో రెండు తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిలో ఒకటి రామగుండంలో ఉంది. రామగుండం తోపాటు కేరళ లోని కాయంకుళం NTPC రిజర్వాయర్ పై నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేయనున్నారు మోదీ.
రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను రూ.423 కోట్లతో 450 ఎకరాల భూమిలో నిర్మించింది BHEL. 100 మెగావాట్ల తేలియాడే సోలార్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం ద్వారా సంవత్సరానికి 1.65 లక్షల టన్నుల బొగ్గు ఆదా అవుతుంది. 100 MW రామగుండం ఫ్లోటింగ్ సోలార్ PV ప్రాజెక్ట్ వాణిజ్య కార్యకలాపాలు జూలై 1న ప్రారంభమయ్యాయని NTPC అధికారులు తెలిపారు.
సోలార్ ప్లేట్ లను నీటిపై నిర్మించడంతో.. సోలార్ ప్యానెల్ ల కోసం కావాల్సిన భూ ప్రదేశం ఆదా అవుతోంది, అలాగే నీటి రిజర్వాయర్ పై ఉన్నందున నీరు కూడా ఆవిరి కాకుండా కాపాడుతుంది.