రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. ఎంపీ ఓట్లలో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పోల్ అయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు. ముర్ముకు పోలయిన 540 ఓట్ల విలువ 3,78,000, యశ్వంత్ సిన్హాకు పోలయిన ఓట్ల విలువ 1,45,600గా ఆయన వెల్లడించారు. 15 ఓట్లు చెల్లనివిగా తెలిపారు.
మొత్తం 4809 ఓటర్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 763 పార్లమెంట్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపును ఆంగ్ల అక్షరాల ప్రకారం ఒక్కో రాష్ట్రానికి చెందిన ఓట్ల లెక్కింపు చేపడతారు. 10 రాష్ట్రాల లెక్కింపు పూర్తయ్యాక ఒకసారి.. 20 రాష్ట్రాలు పూర్తయ్యాక ఇంకోసారి ఫలితాలను వెల్లడిస్తున్నారు.
ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపులో మొదటి 10 రాష్ట్రాల లెక్కింపులో ద్రౌపది ముర్ముకు 809 ఓట్లు వచ్చాయి, వాటి విలువ 1,05,299, యశ్వంత్ సిన్హాకు 329 ఓట్లు, వాటి విలువ 44,276. పార్లమెంటు ఫలితాలను కలుపుకుంటే, ఇప్పటివరకు మొత్తం 1,886 చెల్లుబాటు అయ్యే ఓట్లు, వాటి విలువ 6,73,175. అందులో ద్రౌపది ముర్ముకు 1,349 ఓట్లు, వాటి విలువ 4,83,299. యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు వచ్చాయి, వాటి విలువ 1,89,876 అని పీసీ మోదీ వెల్లడించారు.