భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఇవాళ షేక్ హసీనాతో సమావేశం అయ్యారు. 50 ఏళ్ల బంగ్లాదేశ్ ఆవిర్భావ దినోత్సవాల్లో గౌరవ అతిథిగా కోవింద్ వెళ్లారు. భార్య సవితా కోవింద్, కుమార్తె స్వాతితో ఆయన ప్రత్యేక విమానంలో ఢాకా వెళ్లారు. బంగ్లాదేశ్ త్రివిధ దళాల సిబ్బంది ఆయనకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికారు. బంగబందు మెమొరియల్ మ్యూజియాన్ని సందర్శించిన కోవింద్…షేక్ ముజిబుర్ రెహమాన్ కు అంజలి ఘటించారు. అనంతరం షేక్ హసీనాతో భేటీఅయ్యారు.
అనంతరం బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎకె అబ్దుల్ మోమెన్తోనూ ఆయన సమావేశమయ్యారు. భారత్ సాయంతో బంగ్లాదేశ్ విముక్తి పొంది స్వతంత్య్ర దేశంగా అవతరించి 50 ఏళ్లు పూర్తైంది. 1971 డిసెంబర్ 16న సుమారు 93,000 మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యం, ‘ముక్తి బాహిని’ సంయుక్త దళాలకు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో గురువారం స్వర్ణోత్సవాలు నిర్వహించారు.
గౌరవ అతిథిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొనగా… భారత త్రివిధ దళాలకు చెందిన 122 మందితో కూడిన కాంటిజెంట్ కూడా ఈ పరేడ్లో భాగస్వామ్యమైంది.