నటుడు ప్రకాశ్ రాజ్ తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఆయన నటించిన తాజా చిత్రం జై భీమ్ లోని ఓ సన్నివేశంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తరచూ ఉత్తరాది, దక్షిణాది అంటూ వేరు చేసి మాట్లాడే ప్రకాశ్ రాజ్… హిందీ భాషను చిన్నచూపు చూస్తున్నట్టుగా అందులో ఉంది. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది.
మూవీ తమిళ వర్షన్ వీడియో కనుక గమనిస్తే…తనతో ఓ వ్యక్తి హిందీ మాట్లాడుతుంటే ప్రకాశ్ రాజ్ చెంప చెళ్లుమనిపించి తమిళంలో మాట్లాడు అని హెచ్చరిస్తాడు. ఇక తెలుగు వర్షన్ లో కూడా అదే విధంగా హిందీ వ్యతిరేక భావనను ప్రచారం చేసేలాఉంది. తెలుగు మూవీలోనూ అవతలి వ్యక్తి హిందీలో ఏదో చెప్పబోతాడు. అప్పుడు ప్రకాశ్ రాజు చెంపమీద కొట్టి తెలుగులో చెప్పు అంటాడు. అయితే హిందీ డబ్ లో మాత్రం ఆ వ్యక్తిని చెంపమీద కొట్టి నిజం మాట్లాడు అంటాడు.
ఈ మూడు వీడియో క్లిప్ లు ఇప్పుడు సోషల్మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హిందీపట్ల ద్వేషం పెంచేలా అందులో అతని తీరు ఉందంటున్నారు. తమిళనాడు, తెలుగురాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో నివసించే ఉత్తరభారత పౌరులు హర్ట్ అయ్యేలా ఆ డైలాగ్ ఉందంటున్నారు నెటిజన్లు. అసలు తమిళనాడులో ఆఫీసులో పనిచేసే వ్యక్తి తమిళంలో కాక హిందీలో మాట్లాడ్డం అంటే ఉద్దేశపూర్వకంగానే ఆ సీన్ పెట్టారని చాలామంది ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే మూడు భాషల్లోనూ ప్రకాశ్ రాజే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఉత్తరాదివాళ్లన్నా, హిందీ అన్నా ప్రకాశ్ రాజ్ కు చిన్నచూపు అని…సినిమాల్లోనూ, బయటా పదేపదే తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నారని మండిపడుతున్నారు పలువురు. ఆవీడియోను షేర్ చేస్తూ ప్రకాశ్ రాజ్ ను ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. హిందీ అంటే నచ్చని ప్రకాశ్ రాజ్ సిగ్గులేకుండా డబ్బుకోసం హిందీ సినిమాల్లో నటించాడని, ప్రకాశ్ రాజ్ ముంబైలో ఉన్నప్పుడు మరాఠీ మాత్రమే మాట్లాడగలడా అని …ఇలా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.