అలంపూర్ నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రను ప్రారంభించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సంజయ్ కు శుభాకాంక్షలు చెప్పి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా అలంపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నేటితో మొదలైన సంజయ్ పాదయాత్ర మే 14న మహేశ్వరంలో ముగియనుంది. అంతకుముందు జోగులాంబ ఆలయంలో సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ సీనియర్లు బండి వెంట ఉన్నారు. అలంపురం వెళ్లేముందే హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలోని మహావీర్ మఠ్ హనుమాన్ ఆలయాన్ని సంజయ్ దర్శించుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ విధానాల్ని ఎండగడుతూ పాదయాత్ర మొదలుపెట్టింది బీజేపీ రాష్ట్రశాఖ. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల గుండా యాత్ర సాగేలా సన్నాహాలు చేస్తోంది. గతేడాది మొదటి విడత పాదయాత్ర 2021 ఆగస్టు 24న హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమైంది.
అక్టోబర్ 2న గాంధీజయంతి నాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో యాత్ర ముగిసింది.
మొదటి విడత యాత్రలో వందలాది గ్రామాలను తిరుగుతూ అన్ని వర్గాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు సంజయ్. అదే స్ఫూర్తితో అంబేద్కర్ జయంతి రోజున ఇవాళ జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు.
టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు… కేంద్రంలోని నరేంద్రమోదీ చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఈ యాత్రద్వారా నేరుగా ప్రజలకు వివరించనున్నారు సంజయ్.
దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమి , ఇంటికో ఉద్యోగం, పోడు భూములకు పట్టాలు, బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత వంటి హామీలతో ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని యాత్రద్వారా ఎండగట్టబోతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో తీసుకొచ్చిన దళితబంధు పధకం అమలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు రైతు రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ వంటి అమలుకాని అనేక ప్రభుత్వ హామీల విషయమై ప్రభుత్వాన్ని ప్రజల సమక్షంలో నిలదీసేందుకు యాత్రద్వారా సిద్ధమయ్యారు సంజయ్.