వచ్చే నెలలో జరిగే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికకోసం అధికార పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఎన్నికల అనివార్యమైంది. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కొన్నిరోజుల క్రితమే పాల్వాయి స్రవంతిని పోటీలో నిలుపుతున్నట్టు ప్రకటించింది. ఇక అధికార పార్టీనుంచి పోటీకోసం పలువురు ఆసక్తి చూపగా…సుదీర్ఘచర్చల అనంతరం కూసుకుంట్ల పేరును ఖరారు చేశారు కేసీఆర్. మునుగోడులో త్రిముఖపోరు ఉంటుందని అంచనావేస్తున్నారు.ఎన్నికకు ఇంక నెలరోజులుకూడా లేదు. దీంతో అన్నిపార్టీలు మునుగోడులో మోహరించాయి. అభ్యర్థి గెలుపుకోసం ప్రచారాన్ని ఎప్పుడో మొదలుపెట్టాయి. ఇక అభ్యర్థి ప్రకటనతో టీఆర్ఎస్ సైతం దూకుడు పెంచింది. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 3న కాగా…6న ఫలితం ఉంటుంది.