అక్కడక్కడా ఘర్షణలతో మునుగోడు పోలింగ్ ముగిసింది. పెద్దసంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగిసిన ఆరు గంటల తరువాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో బారులుగా దర్శనమిచ్చారు ఓటర్లు. అయితే ఆరుగంటల్లోగా కేంద్రానికి వచ్చిన అందరికీ ఓటువేసే అవకాశం కల్పించింది ఈసీ. చివరి రెండు గంటల్లో గణనీయంగా పోలింగ్ నమోదవడం విశేషం.
ఉదయం 7 గంటలనుంచే పెద్దసంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. కొన్నిచోట్ల ఉదయం కాస్త పలుచగా కనిపించినా మధ్యాహ్నం కల్లా పోలింగ్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి.
పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. చండూరు పట్టణంలో, మర్రిగూడ మండల కేంద్రంలో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మర్రిగూడలో స్థానిక బీజేపీ నాయకులు స్థానికేతరులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆక్రమంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ నాయకుల ఘర్షణతో కొద్దిసేపు ఉద్రిక్తం నెలకొంది. పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. శివన్నగూడెంలో కూడా కొద్దిసేపు ఉద్రిక్తం నెలకొంది. కొన్ని గ్రామాల్లో ఎవరూ తమకు డబ్బులివ్వనందున ఓట్లువేయమని చెప్పగా…తమ గ్రామ సమస్యలు తీర్చేవరకూ ఓటేయబోమని కొన్ని తండాల్లో ఓటర్లు భీష్మించుక్కూర్చున్నారు. స్థానిక నాయకులు నచ్చజెప్పడంతో వారు కూడా ఓటుహక్కు వినియోగించుకున్నారు.