ఉచిత హామీలపై రాజకీయపార్టీలను నిలువరించలేమని సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. బీజేపీ నేత అశ్వినికుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయనీవ్యాఖ్యలు చేశారు.అయితే తమ వాదనలు కూడా వినాలంటూ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ నూ సుప్రీం విచారించింది.
ఉచిత హామీలు ఇవ్వకుండా చూడాలని..ఆ మేరకు ఈసీకి ఆదేశాలివ్వాలని సుప్రీంను కోరారు అశ్వినీకుమార్. దీనిపై జస్టిస్ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమ కొహ్లీ ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. దీనిపై లేవనెత్తిన అంశాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ పిటిషన్పై విచారణలో తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే సుప్రీంకోర్టును కోరాయి. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ. హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని అన్నారు. ఏవి సరైన హామీలు? అనేదే ప్రశ్న అని ఉచిత విద్యను తాయిలం అనలేమని అన్నారు. తాగునీరు, కనీస స్థాయిలో విద్యుత్తును ఉచితంగా అందజేయడాన్ని తాయిలంగా చెప్పలేమన్నారు. ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడానికి ఏది సరైన మార్గం అన్నదే చర్చనీయాంశమని… డబ్బు వృథా అవుతోందని కొందరు అంటుంటే… అది సంక్షేమమని మరికొందరు అంటారని… మీరు మీ అభిప్రాయాలు చెబితే…చర్చించి, ఆలోచించి, నిర్ణయిస్తామని పార్టీలకు సూచించారు చీఫ్ జస్టిస్.
రాజకీయ పార్టీలు ఇచ్చే అన్ని హామీలనూ తప్పుపట్టలేమని..ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చే తాయిలాలు అనలేమని..గ్రామీణ ఉపాధిహామీపథకం పేద ప్రజలు హుందాగా జీవించే వీలును కల్పించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారాయన. దీనిపై తదుపరి విచారణ వచ్చేవారం జరగనుంది.
రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత తాయిలాల హామీలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. అయితే ఈ కమిటీలో పాలుపంచుకోవడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ విముఖత వ్యక్తం చేసింది.