రాజస్థాన్ సంక్షోభం మరింత ముదురుతోంది. గెహ్లాట్ బెట్టు వీడడం లేదు. ఆయన తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ తో గెహ్లాట్ సమావేశమైనా తన మాట నెగ్గించుకోవడానికే పంతం ప్రదర్శిస్తున్నారు. తనకు మద్దతుగా రాజీనామా చేసిన వందమంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ ను సీఎంగా అంగీకరించబోరని తేల్చిచెప్పారు. గెహ్లాట్ తీరుపై ఖర్గే సైతం ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని…రాష్ట్రంలో తాజాపరిస్థితిపై హైకమాండ్ కు నివేదిక ఇస్తానని అన్నారు. అటు అజయ్ మాకెన్ సైతం గెహ్లాట్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరోసారి ఆయన్ని కలవకుండానే ఢిల్లీ తిరిగివెళ్లిపోయినట్టు తెలిసింది. మరో సీనియర్ నేత కమల్ నాథ్ కు రాజస్థాన్ సమస్యను పరిష్కరించే బాధ్యతను అప్పగించింది పార్టీ.ఉన్నపళంగా డిల్లీకి రప్పించుకుంది.
అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా గెహ్లాట్-పైలట్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తదుపరి సీఎంగా సచిన్ పైలట్ ను ఒప్పుకోబోమని… గెహ్లాట్ చెప్పిన వ్యక్తినే సీఎంకుర్చీలో కూర్చోబెట్టాలంటూ ఆయన మద్దతుదారులుగా ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తమ రాజీనామా పత్రాలను స్పీకర్ జోషికి ఇచ్చారు కూడా. అయితే గెహ్లాట్ సైతం సీపీ జోషిని సీఎంచేయాలనుకుంటున్నారు. దీంతో సంక్షోభాన్ని చక్కదిద్దే బాధ్యతను ఇతర సీనియర్లకు అప్పగించింది పార్టీ. మరి గెహ్లాట్ పట్టువీడుతారా లేదా అనుకున్నది సాధించుకుంటారా అన్నది చూడాలి.