టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత విద్యార్థి పరిషత్ ఆందోళన బాట పట్టింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగిన ఏబీవీపీ విద్యార్థినాయకులకు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఇక ఏబీవీపీ తెలంగాణ స్టేట్ సెక్రటరీ ఝాన్సీపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతోంది. నిరసనలో పాల్గొన్న ఆమెను మగపోలీసులు విచక్షణారహితంగా ఈడ్చివేయడంపై విద్యార్థిలోకం భగ్గుమంటోంది. మహిళా పోలీసులను అందుబాటులో ఉంచకుండా మగ పోలీసులు ఆమెను, ఇతర ఉద్యమకారులను ఇష్టారీతిన లాక్కెళ్లడంపై పలువురు అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఝాన్సీకి పలు గాయాలయ్యాయి. ప్రభుత్వ దమనకాండకు తలొగ్గేదిలేదని…రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా ఏబీవీపీ ఉంటుందని…సమస్యలపై తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఝాన్సీ స్పష్టం చేశారు.