మన తెలంగాణలో గ్రామీణ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం . ఈ కార్యకలాపాలకు శుభప్రదంగా భావించే రోజు “పోలాల అమావాస్య.”
రైతులకు అత్యంత ముఖ్యమైన పండగరోజు ఇది.
పొలాల అమావాస్య సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వస్తుంది. వ్యవసాయదారులు శ్రావణమాస చివరి రోజుల్లో పొలాల అమావాస్యను జరుపుకుంటారు. హనుమాన్, పోచమ్మ ఆలయాల చుట్టూ ప్రదర్శనలు చేసి ఇంట్లో పిండి పదార్థాలతో కూడిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ముఖ్యంగా బసవేశ్వరుని రూపంలో ఉన్న ఎద్దులను కొలుస్తూ ఆతిథ్యాన్ని అందజేస్తారు.
పొలాల అమావాస్యను రైతుల అమావాస్యగా, వ్యవసాయ అమావాస్యగా కూడా పిలుస్తారు.
ఒకరోజు పార్వతి దేవి శివుడితో “నిరంతరము భక్తుల పూజలందుకునే నీవు…,నీ నందివాహనునికి కూడా పూజలందుకునే అవకాశాన్ని కల్పించలేకపోయావా!?”
అని కోరిందట.
అప్పుడు “శ్రావణ మాసం చివరిరోజయిన అమావాస్య నాడు పొలాల అమావాస్య పేరుతో బసవన్నలను పూజించుకొనే వరాన్ని ప్రసాదించాడట శివుడు”. అని మన పూర్వీకులు పొలాల విశిష్టతను చెప్తుంటారు.
పొలాల అమావాస్య రోజు నందీశ్వరున్ని పూజిస్తే సాక్ష్యాత్తు ఆ శివపార్వతులు ఆశీర్వదిస్తారని రైతుల ప్రగాఢ విశ్వాసం.
పొలాల అమావాస్య ముఖ్యంగా మూడు రోజుల పండుగ . మొదటి రోజు ఉప్పులు :-
రైతుకు అండగా వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎద్దులను “ఉప్పులరోజు” ఉదయాన్నే కొమ్ములు సరిచేసి సాయంత్రం నాలుకపై ఉప్పును రాకి,తినిపిస్తారు. కలుపు మొక్కలు, పసరుగడ్డి మొదలైనవి తిని వాటి నాలుక మొద్దుబారిపోయి ఉంటుంది. ఉప్పు తినిపించడం ద్వారా నాలుక అంతా శుభ్రం అవుతుంది. పూజ చేసి వాటి నాలుక,వీపుపై పసుపు రాసి మంచి నూనె తాగిస్తారు. ఎంతో బరువులు మోసిన ఎద్దుల బరువులను తగ్గించడమే ఉప్పల పండగ ప్రాధాన్యత.
ఉప్పు తినిపించడం వల్ల వాటి జీర్ణాశయంలో పేరుకుపోయిన మలినాలను పూర్తిగా తొలగిస్తాం. నూనె తాగించడంతో జీర్ణాశయాన్ని మామూలు స్థితికి తీసుకు రావడం, అలాగే పసుపు ఆంటీబయోటిక్ గా పని చేయడం వంటి శాస్త్రీయ అంశాలు కూడా ఉప్పుల పండుగలో దాగి ఉన్నాయి.
రెండవ రోజు బసవన్న పండుగ :-
పొలాల రోజున ఎద్దులను ప్రత్యేక ఆకర్షణగా అలంకరిస్తారు .
ఉదయం ఎద్దులను సమీప వాగులు, జలాశయాలలో శుభ్రంగా కడిగి, కొమ్ములకు రంగులు వేసి, బుగ్గలు,రంగు రంగుల పేపర్లతో కొమ్ములను,
గంటలు,గజ్జెలు,గుగ్గుర్లతో వాటి గంగడోలును అలంకరిస్తారు.
వివిధ అల్లికలు, ఎంబ్రాయిడరీ లతో తయారు చేసిన జూన్ల(వస్త్రం)తో మూపురం నుండి తొక దాకా చూడ చక్కగా ముస్తాబు చేస్తారు. సాయంత్ర సమయాన గ్రామములోని ప్రజలంతా ఒకచోట చేరుకుంటారు.
గ్రామ పెద్ద లేదా పటేల్ లేదా పెద్దకాపు ఇంటి నుండి ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో రైతులంతా సామూహికంగా బసవన్నల తో బయలు దేరి గ్రామములోని దేవాలయల చుట్టూ “హర హర మహాదేవ శంభో శంకర” అంటూ మహా దేవుని నామ స్మరణ చేస్తూ ప్రదక్షణాలు చేయిస్తారు.
తదుపరి ఇళ్ల వద్ద ప్రత్యేకంగా వండిన పిండివంటలను తాంబులాలను నైవేద్యాలుగా సమర్పించుకుంటారు.
పాలేరు లకు కొత్త బట్టలు, డబ్బులను కృతజ్ఞతగా సమర్పించుకుంటారు.
మూడవరోజు బొడిగె:-
పవిత్రమైన శ్రావణమాసంలో చాలామంది ప్రజలు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు.
నెల రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉండడంతో బొడిగె రోజున బృందాలుగా ఏర్పడి మేకలను కోసుకొని పాలు(భాగం ) వేసుకుంటారు. కోళ్లు, మేకలకు ఈరోజు భలే గిరాకీ ఉంటుంది .
శాస్త్రీయంగా బొడిగెను పరిశీలిస్తే శ్రావణ మాసంలో అధికంగా వర్షాలు కురుస్తాయి దీని వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది. మాంసాహారం తీసుకోవడం తో జీర్ణ సంబంధ ,శారీరక సంబంధ రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంది.
మరి కొన్ని ప్రాంతాల్లో పొలాల అమావాస్య రోజును మాతృ దినోత్సవంగా జరుపుకుంటూ “కంద మొక్కను” పూజించడం శుభప్రదం అని భావిస్తారు.