
file photo
భారత్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలలో భారతీయ సంస్కృతి పట్ల, జాతీయవాదం పట్ల మక్కువ పెరిగింది. అదే సమయంలో భారతదేశంలో అస్థిరపరచడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. భారతదేశంలో ఈ హిందుత్వ పునరుజ్జీవనంతో దశాబ్దాల పాటు దేశ విదేశాలలో అంతర్లీనంగా సాగిన హిందూ వ్యతిరేక కార్యకలాపాలు ప్రస్తుతం బహిర్గతం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో లీసెస్టర్, టొరెంటో, న్యూ జెర్సీ, ఆస్ట్రేలియా వంటి అనేక ప్రాంతాలలో ఆ హిందూ వ్యతిరేక భావజాలం బహిర్గతమైంది.
ఈ మధ్య, బంగ్లాదేశ్లోని పలు నగరాల్లో ఒకే రాత్రిలో 14 హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. గుర్తుతెలియని దుండగులు హిందూ దేవీదేవతల విగ్రహాల తలలు, కాళ్లు, చేతులు నరికేశారు. ఆస్ట్రేలియాలో ఖలిస్థానీ అనుకూల దుండగులు, భారత జాతీయ పతాకంతో ప్రదర్శనగా వెళుతున్న భారతీయులపై దాడులకు తెగబడ్డ సమయంలోనే బంగ్లాదేశ్ లోనూ ఈ దాడులు జరిగాయి. హిందువులు శాంతియుతంగా ర్యాలీగా వెళుతున్న సమయంలో కొంతమంది ఖలిస్థానీ అనుకూల దుండగులు రాడ్లు, కత్తులు పట్టుకుని అమాయక హిందువులపైకి దాడులకు తెగబడ్డట్టుగా, మనకు ఆ సమయంలో వెల్లడైన వీడియోలలో స్పష్టంగా కనిపిస్తోంది. హిందూ దేవాలయాల గోడలపై భింద్రన్వాలే అనుకూల నినాదాలు, భారత్ వ్యతిరేక నినాదాలు, ‘ఖలిస్తాన్ జిందాబాద్’ ‘హిందుస్తాన్ ముర్దాబాద్’ వంటి వ్రాతలు కనిపించాయ్. గత సంవత్సరం, శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్లలో జరిగిన హిందూ ఊరేగింపులలో ముస్లిం గుంపులు భారీ రాళ్లదాడులకు, దహనాలకు పాల్పడ్డాయ్. హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగే ఈ దాడులేవీ ఏదో యధాలాపంగా, ఎక్కడికక్కడ స్థానిక కారణాల వల్ల జరుగుతున్నవి కావు. ప్రపంచవ్యాప్తంగా well planned గా జరుగుతున్న హిందూ వ్యతిరేక కార్యకలాపాలలో భాగం. “ప్రపంచవ్యాప్తంగా హిందూత్వాన్ని నాశనం చెయ్యాలి” “Dismantling global Hindutva” కార్యక్రమంలో భాగం.
అలాగే ఇటీవల న్యూయార్క్ టైమ్స్ పత్రిక భారత్లో తనకొక బిజినెస్ కరస్పాండెంట్ కావాలంటూ ఓ ప్రకటనను ప్రచురించింది. అందులో వారు “భారత భవిష్యత్తు నేడు కూడలిలో ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని మెజారిటీ హిందువుల స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తున్నారు. భుజబలంతో కూడిన జాతీయవాదాన్ని సమర్ధిస్తున్నారు. ఆయన ఈ తరహా వైఖరి ఆధునిక భారతదేశ స్థాపకుల బహుళ సాంస్కృతిక లక్ష్యాలతో కూడిన ఆలోచనలతో విభేదిస్తుంది.” అని పేర్కొన్నారు. ఒక బిజినెస్ కరస్పాండెంట్ కావాలనే ప్రకటనకు, ఈ వ్యాఖ్యలకు ఏమైనా సంబంధం ఉందా? అంటే… తమకు మోడీ విధానాలను వ్యతిరేకించే బిజినెస్ కరస్పాండెంట్ కావాలని వారు చెప్పకనే చెప్తున్నట్టు కదా? కాబట్టి మన దేశం నుంచి అంతర్జాతీయ మీడియాలో ప్రవేశం పొందాలంటే ఎవరికైనా సరే మెరిట్, హార్డ్ వర్క్ కంటే మోడీ వ్యతిరేకితే ప్రధానమైన అర్హత అనే విషయం అర్థమవుతుంది కదా? పాశ్చాత్యుల హిందూ ద్వేషం, వారి సంకుచితత్వం, పక్షపాత ధోరణి మనకు ఈ సంఘటనతో అర్థమవుతుంది కదా?
కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం, తప్పుడు రాతలని, తప్పుడు కథనాలను తరచూ వినిపిస్తూ ఉంటారు. దేశంలో జరిగే చిన్నచిన్న ఘటనలను కూడా చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తుంటారు. బిబిసి, వాషింగ్టన్ పోస్టు, యువర్ టైమ్స్ వంటివన్నీ భారతదేశంలో హిందూ తీవ్రవాదం పేట్రేగిపోతుందని, భారత్ అన్ని రంగాలలో విఫలమవుతోందని అరచి అరచి చెబుతున్నాయి. అంతేకాదు అవి ‘హిందూ జాతీయ వాదం’ అనే పదాన్ని కూడా ఈమధ్య తరచుగా వాడుతున్నాయి. భారత్ ను దెబ్బతీయడానికి ఆ పదాన్ని ఒక ఆయుధంగా వాడి ప్రయత్నం చేస్తున్నారు.
2019, ఆగస్టు 10వ తారీఖున “Inside Kashmir, Cut Off from the World: ‘A Living Hell’ of Anger and Fear” “కోపము, భయం గుప్పెట్లో ప్రపంచం నుంచి వేరు చేయబడిన భూతల స్వర్గం కాశ్మీరం” అనే పేరుతో ఓ కథనం వెలువడింది. ఇది పూర్తిగా అసత్యాలు, అద్భుత కల్పనలతో నిండిన కథనం. కాశ్మీరం ఏ విధంగా భూతల స్వర్గం? అక్కడ దశాబ్దాల పాటు హిందువులు నరకయాతన అనుభవించారు కనుకనా? 1990 లలో హిందువులపై జరిగిన దారుణ మారణకాండ మాటేమిటి? లక్షలాదిమంది తమ ఇళ్ళను ఆస్తులను వదిలిపెట్టి కట్టుబట్టలతో దేశంలోని వివిధ ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నారే? ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారే? వారి తరపున న్యూయార్క్ టైమ్స్ ఎందుకు నిలబడదు?
ఇక కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పాశ్చాత్య పత్రికలు ప్రదర్శించిన ప్రకోపం అంతా ఇంతా కాదు. 2022 ఏప్రిల్ 30న “Death Is the Only Truth. Watching India’s Funeral Pyres Burn,” “మరణమే సత్యం. భారత్లో రగులుతున్న చితిమంటలే అందుకు సాక్ష్యం.” అనే పేరుతో న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రపంచం మొత్తం కరోనా కరాళ నృత్యంతో కకావికలవుతున్న సందర్భంలో పాశ్చాత్య మీడియా నిస్సిగ్గుగా భారత్ లో జరిగే శవ దహనాల చిత్రాలను పతాక శీర్షికలకెక్కించింది. భారత్ మొత్తం మృత కళేబరాలతో నిండిపోయిందంటూ తప్పుడు కథనాలను వెలువరించింది.
“What is Hindu nationalism, and how does it relate to the trouble in Leicester?” “హిందూ జాతీయవాదం అంటే ఏమిటి? లీసెస్టర్లోని ఇబ్బందులతో దానికేంటి సంబంధం?” అనే పేరుతో, సెప్టెంబరు 12, 2022 నాటి ది గార్డియన్ పత్రికలో ఒక కథనం వెలువడింది. ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించిన తర్వాత ముస్లిం మూకలు పకడ్బందీ వ్యూహంతో లీసెస్టర్ని దేవాలయాలను ధ్వంసం చేసి హిందువులను భయభ్రాంతులకు గురిచేశారు. హిందువులపై ఇస్లామిక్ మూకలు దాడులు చేస్తున్న అనేక వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. అయినప్పటికీ ది గార్డియన్ హిందూ జాతీయవాదాన్ని ప్రస్తావించి యునైటెడ్ కింగ్డమ్ లో హింసకు హిందూ సమాజాన్ని నిందించింది. సెప్టెంబర్ 2021లో, రాజకీయ ప్రేరిత సంస్థలు కొన్ని ‘డిస్మాట్లింగ్ గ్లోబల్ హిందుత్వ’ పేరుతో ఒక ఈవెంట్ ని నిర్వహించ తలపెట్టాయి. ఇది హిందూ వ్యతిరేక గుంపు ద్వారా నిర్వహించబడింది. కొలంబియా, ప్రిన్స్టన్, బర్కిలీ, హార్వర్డ్, యు-పెన్ వంటి అగ్రశ్రేణి US విశ్వవిద్యాలయాలలోని డిపార్ట్మెంట్లు ఈ హిందూఫోబిక్ కాన్ఫరెన్స్ను స్పాన్సర్ చేయడం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. యునైటెడ్ స్టేట్స్లో హిందువుల పట్ల వ్యతిరేకత సాధారణ విషయం. పాశ్చాత్య దేశాలు ఎప్పుడూ హిందూ సంస్కృతిని చిన్నచూపు చూస్తూనే ఉన్నాయి. విద్యా స్వేచ్ఛ ముసుగులో, ఈ సదస్సు హిందూమతం నుండి ‘హిందుత్వ’ పదాన్ని వేరు చేయడానికి ప్రయత్నించింది. ‘హిందుత్వ’కు వ్యతిరేకంగా మనస్సులను కలుషితం చెయ్యడానికి ప్రయత్నించింది. హిందూ సమాజాన్ని ఇస్లామోఫోబియాతో, ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారిగా, తీవ్రవాద ప్రేరేపకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. 2021లో నాసాలో పనిచేసే ప్రతిమ రాయ్, పూజ రాయ్ అనే ఇద్దరు భారతీయ సంతతి సైంటిస్టులు తమ ఆఫీసు టేబుల్ పైన, గోడల పైన హిందూ దేవి దేవతల మూర్తులను, చిత్రాలను పెట్టుకున్నందుకు వారి పైన సంస్థాగతంగా తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. మీ మత విశ్వాసాలను, సైన్స్ తో ఎలా ముడి పెడతారంటూ యూఎస్ స్పేస్ ఏజెన్సీ వారిని తీవ్రంగా తప్పుబట్టింది. సైన్స్ పైన వారికి ఉన్న అవగాహన, నిబద్ధతను ప్రశ్నించింది. కేవలం వారు హిందువులైన కారణంగా వారి విషయంలో వారి వ్యక్తిగత విశ్వాసాలను గౌరవించాలని యూఎస్ స్పేస్ ఏజెన్సీ భావించలేదు.
ఇటీవల, యునైటెడ్ కింగ్డమ్ జాతీయ ప్రసార సంస్థ, BBC, రెండుసార్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా “ఇండియా: ది మోడీ క్వశ్చన్” అనే డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002 గుజరాత్ అల్లర్లకు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని పేర్కొంటూ అనుచితమైన డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇటువంటి తప్పుడు సమాచారం లక్షలాది మంది పాఠకులను తప్పుదోవ పట్టిస్తుంది. దేశ రాజకీయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. దేశ ప్రజాస్వామ్య వాతావరణానికి కోలుకోలేని హాని కలిగిస్తుంది. 2012లో గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. ప్రస్తుత ప్రతిపక్షం, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో, సిట్ మోడీని నిర్దోషిగా నిర్ధారించింది. గత సంవత్సరం, సుప్రీం కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఒక కేసును విచారిస్తున్న సందర్భంలో కూడా అప్పటి సీత నివేదికను మరోసారి పరిశీలించింది. అప్పుడు కూడా గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోడీకి ఎలాంటి ప్రమేయమూ లేదని కోర్టు తేల్చింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడికి, ప్రస్తుత పాలక వ్యవస్థకు, “ఫాసిస్ట్ భావజాలాన్ని ఆపాదించడానికే ఇటువంటి కుట్రపూరిత, కల్పిత, బూటక కథనాలను ప్రచారం చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.
భారత్ ఇటీవల యునైటెడ్ కింగ్ డమ్ ను దాటి ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ ఇచ్చిన తాజా వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ నివేదికలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు భారత ఆర్థిక వ్యవస్థకు 6.1 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. తరువాతి ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వరకూ వృద్ధి రేటును IMF అంచనా వేసింది. భారత్ ఇప్పుడు అనేక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే ముందుంది. ఇది ఖచ్చితంగా బ్రిటన్ వంటి దేశాలకు కడుపు మండించే విషయం.
“ఇండియా సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. అయినా తో కలిసి, భారత్ ఈ ఏడాది ప్రపంచ వృద్ధిరేటులో నమోదు చేసింది. యూఎస్, యూరోపియన్ దేశాలు అన్నింటి వృద్ధిరేటులో ఇది సుమారు పది శాతం.” అని IMF అధికారి పియర్-ఒలివర్ గౌరించాస్ వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ అప్డేట్ లో భాగంగా ఒక బ్లాగ్ లో రాశారు. ఇన్ని వ్యతిరేక కుట్రలు, రాతలు, ప్రచారాల మధ్య కూడా భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది అనటానికి ఇదే నిదర్శనం. అయినప్పటికీ మన మీద మరింత ఉధృతంగా దుష్ప్రచారాలు జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనపైన అసమాన రీతిలో ఈ దుర్మార్గపు సమాచార యుద్ధం కొనసాగుతుండగానే , మనం ప్రగతి పథంలో ఒక్కొక్క అడుగే ముందుకు వేసుకుంటూ, ప్రపంచ నాయకుడిగా, విశ్వగురువుగా అవతరించటానికి సత్య మార్గంలో పయనిస్తూ ఉన్నాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నట్లుగా ” Shanghai Cooperation Organisation (SCO) కు, G20కి, భారత్ నేతృత్వం వహించటమనేది ప్రపంచ స్థిరత్వాన్ని, భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.” “భారతదేశం యొక్క అభ్యున్నతి భారత సౌభాగ్యం కోసం కాదు, ప్రపంచ శాంతి, సౌభాగ్యం, సౌఖ్యం కోసం.” అని డేవిడ్ ఫ్రాలే ఎప్పుడో చెప్పాడు. విశ్వ హితానికి భారతదేశం…. దేశ హితానికి మన దేహం…. అనే పాత గుర్తుకొస్తోంది నాకిప్పుడు. భారత్ మాతాకీ జై.
– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.