తెలంగాణలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై కొట్టారు. ముఖ్యమంత్రి మరియు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని హస్తం పార్టీలో చేరిపోయారు. పోచారం ఇంటికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లి పోచారం కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు అనంతరం అక్కడికక్కడే పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహించారు.
అసలు పోచారం వంటి సీనియర్ నాయకుడు గులాబీ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు అనేది చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. వాస్తవానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి తరం నాయకుడు కానే కాదు. 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకుడు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాలు మొదలుపెట్టారు. సింగిల్ విండో చైర్మన్ గా తర్వాత నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా పనిచేసి రైతులకు బాగా దగ్గరయ్యారు. ఎన్టీఆర్ ఆకర్షణ లో భాగంగా తెలుగుదేశం పార్టీలో చేరి.. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మరింత పట్టుదలతో బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తూ రైతులకు గ్రామీణులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత 1994 99 లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో పాటు అప్పటి చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ 2009లో మరోసారి టిడిపి తరఫున గెలుపొందారు. దాదాపు 30 సంవత్సరాలు తెలుగుదేశంలో రాజకీయాలు చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి టిడిపిలోనే కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డితో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అంతే కాకుండా రేవంత్ చుట్టూ ఉండేటువంటి మాజీ టిడిపి నేతలతో దగ్గర అనుబంధం ఉంది. దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి మార్గం సుగమం అయింది.
దీనికి తోడు కొంతకాలంగా బి ఆర్ ఎస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇమడ లేకపోతున్నారు. 2011లో తెలంగాణ వాదం కారణంగానే టిడిపిని వదిలిపెట్టి గులాబీ పార్టీలో ఆయన చేరారు అప్పటి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గులాబీ పార్టీ తరఫున విజయం సాధించారు. 2014 19 మధ్య కాలంలో వ్యవసాయ మంత్రిగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇటు ప్రభుత్వం లో అటు పార్టీలో ప్రాధాన్యం దక్కింది. కానీ 2018 ఎన్నికల తర్వాత మంత్రిగా ఆయన్ని తప్పించి స్పీకర్ పదవికి పరిమితం చేశారు. ఇది ఆయనకు ఏమాత్రం ఇష్టం లేని పరిణామం. మరోవైపు పార్టీలో కేటీఆర్ ఆయన సన్నిహితులు హవా పెరగడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డికి పార్టీ మీద పట్టు అంతకంతకు తగ్గిపోతూ వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా పోచారం మాటకు ప్రాధాన్యత దక్కలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కుమారులను నిలిపి రాజకీయ వారసత్వం అందించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి తలపోశారు. కానీ ఇందుకు పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదు. పార్టీ అంతర్గత విషయాల విషయంలో మాట్లాడేందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి కొన్నిసార్లు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ చాలామంది సీనియర్లకు ఎదురైన అనుభవమే.. శ్రీనివాస్ రెడ్డికి కూడా ఎదురయ్యింది. పార్టీ చీఫ్ కేసిఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసి ఎదురుచూసి కళ్ళు కాయలు కాచాయి కానీ ఉపయోగం లేని పరిస్థితి. దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి అసహనానికి గురయ్యారు అని తెలుస్తోంది.
ఈ అసంతృప్తిని పసిగట్టిన కాంగ్రెస్ నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి సందేశం పంపించినట్లు తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న బ్యాచ్ చాలా వరకు అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున తనకి పరిచయస్థలే కావడం కలిసి వచ్చింది. దీంతో పెద్దగా ఆలోచించకుండానే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడు నిష్క్రమించడానికి గులాబీ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. ఇంతకుముందు ఒకరిద్దరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో కలిసిన పెద్దగా పట్టించుకోలేదు కానీ పోచారం వెళ్లిపోవడం మీద అసహనం వ్యక్తం అవుతుంది ఎందుకు తగినట్లుగానే మాజీ ఎంపీ బాల్క సుమన్ ఆధ్వర్యంలో పోచారం ఇంటిదగ్గర ఆందోళనలకు కార్యకర్తలు ప్రయత్నం చేశారు. కానీ సీఎం స్థాయిలో చేరికలు జరుగుతున్నప్పుడు, ఇటువంటి ఆందోళనలు గడబిడలు పెద్దగా ఫలించక పోవచ్చు.