ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రధాని మోదీ విద్యార్హతల విషయంలో న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. ప్రధాని విద్యార్హతల వివరాలను పీఎంవో చూపించాల్సిన అవసరం లేదంది. దీనిపై ఏడేళ్ల క్రితం సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టేసింది. ముందునుంచీ మోదీ విద్యార్హతలను ప్రశ్నిస్తున్న కేజ్రీవాల్ 2016లో సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్ర సమాచార కమిషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన సీఐసీ మోదీ డిగ్రీ, పీజీ పత్రాలు చూపాలంటూ పీఎంవో అధికారులను ఆదేశించింది. అయితే సీఐసీ ఆదేశాలను సవాల్ చేస్తూ…గుజరాత్ యూనివర్సిటీ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లింది. గతనెల న్యాయస్థానం విచారణ జరిపింది. గుజరాత్ యూనివర్సిటీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలు వినిపించారు. మోదీ విద్యార్హతల వివరాలు పబ్లిక్ డొమైన్లో,యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్నాయని..రాజకీయ వ్యవస్థలో ఉన్నతపదవిలో ఉన్న వ్యక్తి ఉన్నత విద్యావంతుడైనా, నిరక్షరాస్యుడైనా తేడా ఏం ఉంటుందని వాదించారు. కేజ్రీవాల్ ది కేవలం అత్యుత్సాహమేనన్నారు. అయితే వివరాలు ఇంటర్నెట్లో లేవని..కాపీ కావాలని అడుగుతున్నామని కేజ్రీవాల్ న్యాయవాది కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఇవాళ దానిపై తీర్పునిచ్చింది. మోదీ సర్టిఫికెట్లలను పీఎంవోగానీ, యూనివర్సిటీ కానీ చూపించాల్సిన అవసరం లేదని తీర్పుచెప్పింది. విలువైన సమయాన్ని వృథా చేశారంటూ…కేజ్రీవాల్ కు 25 వేల జరిమానా కూడా విధించింది.
https://twitter.com/barandbench/status/1641731135561699328?s=20