త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తూ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ. తన అరెస్ట్ వెనక పీఎంవోలో ఉన్న కొందరు గాడ్సే భక్తులున్నారని మండిపడ్డారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకే ముందస్తు కుట్ర చేసినట్టు అర్ధమవుతోందని, ఏ సెక్షన్పై తనను అరెస్టు చేశారో చెప్పలేదని, ఎఫ్ఐఆర్ కాపీ కూడా తనకు ఇవ్వలేదనీ అన్నారు. ఎమ్మెల్యేగా తనకున్న విశేషాధికారాన్ని సైతం గౌరవించలేదని, తన అరెస్టు గురించి కనీసం స్పీకర్ కూ సమాచారం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అది గుజరాత్ గౌరవాన్ని కించపర్చడం కాదా అని ఆయన ప్రశ్నించారు. శాంతి సామరస్యాలు కాపాడాలని కోరే ఉద్దేశమే తప్ప తన ట్వీట్లో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు మేవాని. ఆ ఒక్క కారణంతో తనను అరెస్ట్ చేయడం అంటే కుట్రకాక ఇంకేమంటారనీ అన్నారు. ఈ క్రమంలోనే ప్రధానికి వ్యతిరేకంగా ట్వీ్ట్ చేశారంటూ కోక్రాఝర్ జిల్లా బీజేపీ నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో గత ఏప్రిల్ 20న అసోం పోలీసులు గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో మేవానిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 25న మేవానికి కోక్రాఝార్ కోర్టు బెయిలు మంజూరు చేయగా, ఒక మహిళా పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన మరో కేసులో ఆయనను తిరిగి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అరెస్టైన సందర్భంలో టాలీవుడ్ మూవీ పుష్ప లో అత్యంత ప్రాచుర్యం పొందిన డైలాగ్ ను మేవానీ గుర్తు చేశారు. విడుదలైన తరువాత కూడా మీడియాతో మాట్లాడుతూ తగ్గేదే లేదని, తాను నిప్పుని అని ఫ్లవర్ ని కాదని అన్నారు.