ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు గతంతో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ప్రధానికి ప్రస్తుతం స్థిరాస్తి లేకుండా పోయింది. గాంధీనగర్లో 1.1 కోట్ల విలువ చేసే ఒక్క ప్లాటును కూడా ఆయన విరాళంగా ఇచ్చేశారు. మరోవైపు.. బాండ్స్, షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్స్లోనూ పెట్టుబడి పెట్టలేదు. సొంతంగా కారు కూడా లేదు. అయితే, సుమారు రూ.1.73 లక్షల విలువైన మూడు బంగారు ఉంగరాలు ఉన్నాయి. అలాగే పోస్ట్ ఆఫీస్ లోని నేషనల్ సేవింగ్స్ విలువ రూ.9,05,105, జీవిత బీమా పాలసీల విలువ రూ.1,89,305గా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31నాటికి ప్రధాని సహా మరో పది మంది కేంద్ర మంత్రులకు ఉన్న ఆస్తుల వివరాలను తన వెబ్సైట్ లో పీఎంవో కార్యాలయం తాజాగా ప్రకటించింది. పీఎంవో తెలిపిన వివరాల ప్రకారం గతేడాది మార్చి 31 నాటికి రూ.1,97,68,885గా ఉన్న మోదీ చరాస్తుల విలువ.. ప్రస్తుత ఏడాది మార్చి 31నాటికి మరో 26.13 లక్షలు పెరిగింది.
29 కేంద్ర మంత్రుల్లో గత ఆర్థిక సంవత్సరంలోని తమ ఆస్తుల వివరాలను వెల్లడించిన వారిలో ధర్మేంద్ర ప్రదాన్, జోతిరాదిత్య సింధియా, ఆర్కే సింగ్, హర్దీప్ సింగ్ పూరీ, పర్శోత్తమ్ రూపాలా, జీ కిషన్ రెడ్డి సహా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీలు ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ రూ.15.2 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ.1.43 కోట్లు కాగా.. ఆయన భార్య కావ్య చరాస్తుల విలువ రూ.1.85 కోట్లు, కుమార్తె వైష్ణవి చరాస్తుల విలువ రూ.5.51 కోట్లు, కుమారుడు తన్మయ్ చరాస్తుల విలువ రూ.5.51 కోట్లు. కిషన్రెడ్డి పేరిట స్థిరాస్తులు లేవు.