బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్న ప్రధాని మోదీ.. అలా మాట్లాడొద్దంటూ సూచన..!
ఎన్నికలు జరుగుతున్నాయంటే చాలు.. పార్టీలు ఏవైనా సరే.. ప్రజలను ఆకర్షించేందుకు కొంత మంది నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అందులో అధికార పార్టీ బీజేపీకి చెందిన నేతలతో పాటు.. ప్రతిపక్షాల నేతలు కూడా ఉంటారు. అయితే ఈ సంస్కృతిని విడనాడాలని.. ఎన్నికల ప్రచారం చేసేప్పుడు ప్రతిపక్షాల మాదిరిగా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలతో ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎక్కడ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని.. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా అసోం, వెస్ట్ బెంగాల్ నేతలను దృష్టిలో పెట్టుకుని.. ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ,బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.
విపక్షాలు అసభ్య పదజాలం వాడినా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టినా.. బీజేపీ నేతలు వారి ట్రాప్లో పడి రెచ్చిపొవద్దన్నారని తెలుస్తోంది. గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షా, ఇతర ప్రముఖ నేతలు పాల్గొన్నారు.