2013-14 నుంచి 2021-22 మధ్య బాస్మతి మినహా మిగతా బియ్యం ఎగుమతులు 109% పెరుగుదల – కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
భారత్ లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 2013-14లో $2,925 మిలియన్ల నుంచి 2021-22లో 109 శాతం పెరిగి $6,115 మిలియన్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021-22లో అన్ని వ్యవసాయ ఉత్పత్తులలో నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతి అగ్రస్థానంలో ఉందని మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ప్రపంచ బియ్యం వ్యాపారంలో భారతదేశం అత్యధిక వాటాను కలిగి ఉంది. ఈ డేటాపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలు రైతులకు ప్రపంచ మార్కెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు, అలాగే ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు.