ముగ్గురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతలను కర్ణాటక ఉప్పినగండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న పెద్దసంఖ్యలో సంస్థ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యకర్తల నిరసనలు కొనసాగాయి. దీంతో అందులో ఒకర్ని పోలీసులు వదిలేశారు. మరో ఇద్దరి విడుదలనూ డిమాండ్ చేస్తూ పోలీసుల మీద ఒత్తిడి పెంచారు. నిరసనల్లో భాగంగా రాత్రిపూట పోలీస్ స్టేషన్ ఎదుటే నమాజ్ కు సిద్ధమైన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆందోళనకు నాయకత్వం వహించిన ఓ వ్యక్తికి దెబ్బతగలడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆ పరిసరాల్లో సెక్షన్ 144 అమలుచేస్తున్నారు.