ప్రారంభోత్సవ వేడుకకు కొన్నిరోజుల ముందు పార్లమెంట్ భవనంపై పంచాయతీ మొదలైంది. తాజాగా ఆ పంచాయతీ సుప్రీంకు చేరింది. నూతన భవనాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ప్రధాని ఎలా ప్రారంభిస్తారని అభ్యంతరం తెలుపుతున్న 19 పార్టీలు ప్రారంభ వేడుకను బాయి్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాక మోదీ ప్రారంభించడం అంటే.. ప్రజాస్వామ్యంపైనే దాడేనని విపక్షాలు అభివర్ణించాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జనతాదళ్ (యునైటెడ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, సీపీఎం, సీపీఐ, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్ (మణి), ఆర్ఎస్పీ, వీసీకే, ఎండీఎంకే, ఆర్ఎల్డీ పార్టీలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. అయితే విపక్షాల తీరుపై అధికార బీజేపీ మండిపడుతోంది. వాళ్లకు ముర్ము మీద ప్రేమ, అభిమానం లేవని…మోదీ ద్వేషంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాయని మండిపడుతోంది. గిరిజన మహిళను రాష్ట్రపతిగా పోటీలో పెడితే అవమానించి వాళ్లు ఇప్పుడు ముర్మును తాము అవమానిస్తున్నామనడం హాస్యాస్పదమంటున్నాయి. రాష్ట్రపతే పార్లమెంట్ ను ప్రారంభించాలనే నిబంధనేంలేదని… గతంలో పార్లమెంట్ ప్రాంగణంలోని అనుబంధ భవనాలను ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రారంభించాయని గుర్తు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.