రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన బనేశ్వర్ జాతరకు అనుమతి నిరాకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం… అజ్మీర్లో ఉర్సు జాతరకు మాత్రం అనుమతిచ్చింది.
రాజస్థాన్ తోపాటు గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచీ పెద్ద ఎత్తున భక్తులు బనేశ్వర్ జాతరకు వస్తారు. రాజస్థాన్ ఎన్నో కళలకు ప్రసిద్ధి. చేతివృత్తి కళాకారులు జాతరలో దుకాణాలు ఏర్పాటు చేసి తమ చేతితో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. వాళ్లలో చాలామంది గిరిజనులే ఉంటారు.
బనేశ్వర్ జాతర ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు జరగాల్సింది. కానీ ప్రభుత్వం కోవిడ్ కారణంగా అనుమతి నిరాకరించింది. అయితే ఫిబ్రవరి 16న రాష్ట్రమంతటా ఆంక్షల్ని ఎత్తివేసింది. పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, క్రీడా వేదికలు, మాల్స్, రెస్టారెంట్లు మొదలైన వాటిని 100 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించేందుకు అనుమతించారు.
అలాగే పెళ్లికి వచ్చే అతిథుల సంఖ్యపై ఆంక్షలు ఎత్తివేశారు. కానీ బనేశ్వర్ జాతరకు అనుమతివ్వలేదు.
హిందువుల నమ్మకాలు, ఆచారాల పట్ల ప్రభుత్వం పక్షపాత వైఖరికి ఇదే నిదర్శమని జనం మండిపడుతున్నారు.
ఈ జాతర అక్కడి గిరిజనుల 5 రోజుల పండుగ. లక్షలాది మంది భక్తులను ఆకర్షించే దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒక్కటి. బనేశ్వర్ జాతర నిజానికి రెండు జాతరల కలయిక. శివుని స్వరూపంగా పిలువబడే బనేశ్వర్ మహాదేవ్ ను స్మరిస్తూ ఈ ఉత్సవం నిర్వహిస్తారు. అక్కడి విష్ణు ఆలయ నిర్మాణ పనులు పూర్తి అయిన రోజుని జరుపుకుంటారు. ఆ
ఆలయాన్ని సాధువు మావ్జీ కోడలు జంకున్వర్ నిర్మించారు. బనేశ్వర్ దేవాలయం ప్రధానంగా సోమ్, మహి నదుల సంగమం ద్వారా ఏర్పడిన డెల్టాలో ఉన్న గౌరవనీయమైన స్వయంభూ శివలింగానికి ప్రసిద్ధి చెందింది.
బనేశ్వర్ ధామ్ గిరిజనుల విశ్వాసానికి కేంద్రం. బన్స్వారా, దుంగార్పూర్, ఉదయ్పూర్, ప్రతాప్గఢ్ సహా గుజరాత్ నుంచి వచ్చే గిరిజనులు జాతర లేకపోవడంతో నిరాశ చెందారు. చాలా మంది గిరిజనులు ఈ జాతర సందర్భంగా వారి కుటుంబ సభ్యుల అస్థికలను పుణ్యనదిలో కలపడం ఆచారంగా వస్తోంది.
ప్రభుత్వ ఈ తీరును రాజస్థాన్ బిజెపి నిరసించింది. జాతరను అనుమతించాలని ఆందోళనకు దిగినా ఫలితం లేకపోయింది.