దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వైభవంగా జరుపుకున్నారు. రాజధాని నగరాలు పట్టణాలు పెద్ద గ్రామాలు అన్నిచోట్ల ఈ కార్యక్రమం నిర్వహించారు ఇతర దేశాల్లో కూడా యోగా దినోత్సవం జరుపుకోవడం గమనించాల్సిన విషయం.
వాస్తవానికి యోగా దినోత్సవం అంటే పది ఏళ్ళ క్రితం చాలా మందికి తెలియనే తెలియదు. యోగా గురించి పెద్దగా పట్టింపు కూడా ఉండేది కాదు. పాఠశాలల్లో అప్పుడప్పుడు నేర్పించే ఆసనాలు అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఆ సమయంలో యోగ సూర్య నమస్కారాలు వంటి వాటి గురించి మాట్లాడితే ఆర్ఎస్ఎస్సా,, విశ్వహిందూ పరిషత్తా.. అంటూ హేళన చేసేవారు కూడా. భారతీయ జీవన విధానం గురించి మాట్లాడితే తప్పు అన్నట్లుగా ఆధునిక యుగం పరుగులు పెడుతున్న సమయం అది.
కానీ ఆ సమయంలో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించేటట్లుగా చొరవ తీసుకున్నారు. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు వ్యవస్థలు కూడా అనుసరించాల్సి వచ్చింది. నిజానికి యోగ అంటే ఆరోగ్యకరమైన జీవన విధానం దాని తెలియ చెప్పడమే యోగా దినోత్సవం గొప్పతనం.
అందుచేతనే ప్రతి ఏడాది మాదిరిగాని ఈ ఏడాది కూడా యోగా దినోత్సవం నిర్వహించారు. పైగా ఈసారి కాశ్మీర్ లోయలో యోగా దినోత్సవం నిర్వహించడం విశేషం. కాశ్మీర్ లోయల్లో శాంతి నెలకొంది అనేటువంటి సందేశం ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయింది అంతేకాకుండా అక్కడ ప్రజలు భారతీయ సమాజంతో మమేకం అయ్యారు అన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి ఎందుకు తగినట్లుగానే అక్కడ యోగ కార్యక్రమంలో ముస్లిం మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్-ఏ-కశ్మీర్ కాన్ఫరెన్స్ హాల్ వద్ద జరిగిన అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
దాల్ సరస్సు ఒడ్డున మోదీ 7000 మందితో యోగా చేయవలసి ఉండగా వర్షం కారణంగా కార్యక్రమానికి అంతరాయం కలిగింది. కార్యక్రమాన్ని ఇండోర్ స్టేడియంకు మార్చారు. ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనగర్లో ఒక శక్తి ఉందని, యోగా ద్వారా దానిని మరింత పెంచుకోవచ్చని తెలిపారు. గత పదేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.
2014లో తొలిసారి తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించానని గుర్తు చేశారు. భారతదేశ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయని చెప్పారు. ఇదొక రికార్డు అని తెలిపారు. అప్పటి నుంచి యోగా దినోత్సవం సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉందన్నారు. విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని వెల్లడించారు.
యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని పేర్కొంటూ జర్మనీలో ప్రస్తుతం కోటిన్నరమంది నిత్యం యోగా చేస్తున్నారని తెలిపారు. యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందని తెలిపారు. మన దేశంలోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయని చెప్పారు.
మొత్తానికి నరేంద్ర మోడీ చొరవతో దేశ విదేశాల్లో యోగా మీద ఆసక్తి పెరిగింది వ్యక్తిగతంగా యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది మరోవైపు పది మంది కలిసి యోగా చేస్తే ఆయా వ్యక్తుల మధ్య అనుబంధం కూడా ఏర్పడుతుంది ఫలితంగా సమాజంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లే వాతావరణం నెలకొంటుంది అందుచేతనే ఇప్పుడు దేశంలోని అనేక సంస్థలు వ్యవస్థలో కూడా యోగాడేనే నిర్వహించాయి.
డిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్స్లో ఆర్మీచీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైనిక సిబ్బందితో కలిసి యోగా చేశారు. ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠితో పాటు పలువురు నావికాదళ అధికారులు యోగాసనాలు వేశారు. సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకపై నావికాదళ కుటుంబీకులతో పాటు పలువురు ఔత్సాహికులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.
ఎప్పటిలాగే ఈసారి యోగాదినోత్సవాన్ని సైనికులు ఘనంగా నిర్వహించారు. నార్తన్ ఫ్రాంటియర్ మంచుకొండలు, ఈస్టర్న్ లద్దాఖ్ వంటి ప్రతికూల ప్రాంతాల్లో సైనికులు చేసిన యోగాను సైనిక వర్గాలు పోస్టు చేశాయి. లేహ్లోని వాంగ్చుక్ స్టేడియంలో సైనిక సిబ్బంది సామూహిక యోగాసనాలు వేశారు.
వివిధ రాష్ట్రాల్లోని నగరాలు పట్టణాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు పాఠశాలలు కళాశాలలో విద్యార్థులు ఉత్సాహంగా ఆసనాలు సూర్య నమస్కారాలు ప్రదర్శించారు మొత్తానికి దేశమంతా ఈరోజు యోగ స్ఫూర్తితో ముందుకి కదిలింది ఆ ఖ్యాతి నిజంగానే ప్రధాని మోదీకి దక్కుతుందనటం లో సందేహం లేదు.