పశ్చిమ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ మీద హత్యాచారం సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీని మీద దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు పశ్చిమ బెంగాల్లో భద్రత కరువు అయింది అని బహిరంగంగా తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా విద్యార్థి లోకం మమతా బెనర్జీ ప్రభుత్వం మీద మండిపడుతోంది. బెంగాల్ రాష్ట్రమంతటా అనేక పట్టణాలలో విద్యార్థులు రోడ్ల మీదకు చేరి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ముఖ్యమంత్రి మమత నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తున్నారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ మంగళవారం పశ్చిమబంగా ఛాత్రో సమాజ్ నిరసన చేపట్టింది. నబన్నా అభియాన్ పేరుతో హావ్డా నుంచి విద్యార్ధులు ర్యాలీ చేపట్టారు.
అయితే నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వీరిపై బాష్ప వాయువు ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో కోల్కతా పోలీసులు, హౌరా సిటీ పోలీసులతో పాటు భారీ రేడియో ఫ్లయింగ్ స్వ్కాడ్లు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్లు, డ్రోన్లు, వాటర్ ఫిరంగులను ఆ ప్రాంతంలో మోహరించారు. నబన్న పరిసరాల్లో 19 పాయింట్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇతర కీలక ప్రదేశాల్లోనూ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
మరోవైపు సీఎం మమత బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
విద్యార్ధులు ఆందోళన నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఆందోళన చేపట్టే క్రమంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారనే సమాచారంతో నలుగురు విద్యార్ధులను అరెస్ట్ చేశారు. అనేకచోట్ల విద్యార్థి సంఘాల నాయకుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసు చర్యలు పెరిగేకొద్దీ విద్యార్థి లోకంలో అశాంతి పెరుగుతోంది.
మొత్తం మీద ఈ ఆందోళనలు అంతకంతకు పెరిగి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద ప్రభావం చూపిస్తున్నాయి. రాష్ట్రంలో భద్రత లేకపోవడం , హంతకులు గూండాలను అదుపు చేయలేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.