బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదైంది. ఈమేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం బెయిల్ మీద ఉన్న ఎమ్మెల్యేను మళ్లీ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేసినట్టు సీపీ తెలిపారు. అరెస్ట్ అనంతరం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చర్లపల్లి జైలుకు పంపారు.
ఓ ఎమ్మెల్యేపై పీడీయాక్ట్ నమోదవడం ఇదే మొదటిసారి. 2014 నుంచి నేటివరకు 18 మతపరమైన కేసులు సహా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. గతంలో ఉన్న ఈ కేసులతో పాటు రౌడీషీట్ ఆధారంగా చేసుకొని ఆయనపై పీడీ యాక్టును ప్రయోగించినట్లు తెలిపారు.
నాలుగు రోజులక్రితం ఆయన చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో మరునాడు పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి కాసేపటికి వదిలిపెట్టారు.సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని… రిమాండ్ విధించలేం అంటూనాంపల్లి కోర్టు తెలిపింది. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి 48 గంటల్లోపే మరోసారి అదుపులోకి తీసుకున్నారు.
రాజాసింగ్ అరెస్ట్ సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పెద్దసంఖ్యలో యువకులు పోలీసులను అడ్డుకున్నారు. జైశ్రీరామ్, కేసీఆర్ డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు అందర్నీ చెదరగొట్టి ఆయన్ని తీసుకెళ్లారు. ఆయన అరెస్టుకు నిరసనగా బేగంబజార్, ఛత్రీ, కిషన్గంజ్, సుల్తాన్బజార్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. అయితే 24 గంటల్లోనే పరిస్థితి సద్దుమణిగింది.
అటు రాజాసింగ్ పై పీడీయాక్ట్ పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. ఆయన్ని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిందని పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.