నిషేధిత పీఎఫ్ఐకి మరో షాక్. సంస్థ సెప్టెంబర్ 23న ఇచ్చిన పిలుపుతో కేరళ రోడ్డు రవాణాకు వాటిల్లిన నష్టం మొత్తాన్ని చెల్లించాలంటూ ఆరాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఆరోజు సంస్థ ఇచ్చిన పిలుపు హింసాత్మకమైన సంగతి తెలిసిందే. ఆఘటనలో పలు బస్సులు, ప్రైవేట్ వాహనాలూ ధ్వంసం అయ్యాయి. తమకు జరిగిన నష్టాన్ని 5 కోట్ల 20 లక్షలుగా అంచనా వేసింది ఆర్టీసీ. దీంతో రెండు వారాల్లోగా ఆ మొత్తాన్ని హోంశాఖ అదనపు కార్యదర్శికి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
చట్టవిరుద్ధంగా హర్తాళ్ కు పిలుపునిచ్చినందుకు…ప్రభుత్వ ప్రవైట్ ఆస్తులకు నష్టం కలిగించినందుకు పీఎఫ్ఐ నాయకులపై మండిపడింది ధర్మాసనం. అనేక రాష్ట్రాల్లోని తన కార్యాలయాలపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్న సమయంలో సంస్థ బంద్ కు పిలుపునిచ్చింది.
న్యాయస్థానం ముందస్తు ఆదేశాలను నేరుగా ధిక్కరిస్తూ ఫ్లాష్ హర్తాళ్లకు పాల్పడే రాజకీయ పార్టీలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది జస్టిస్ జయశంకరన్ నంబియార్, మహ్మద్ నియాస్ సిపిలతో కూడిన డివిజన్ బెంచ్.