గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటన ఈరోజు తెల్లవారుజామున మహారాష్ట్రలోని గోండియా నగర సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో 53 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. గోండియా, గుధ్మా రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి 1.20 గంటల ప్రాంతంలో గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు సౌత్ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం భగత్ కి కోఠి ఎస్ఎఫ్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ రైలును నియంత్రించలేకపోయారు. దాంతో ముందు నిలిపి ఉంచిన గూడ్స్ ట్రైన్ను ఢీకొట్టింది. దాంతో ఎక్స్ప్రెస్ ట్రైన్ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో గాయపడిన 53 మందిని గోండియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. వెంటనే పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైలును అక్కడి నుంచి పంపించారు.