బెంగాల్ రాజకీయాలు చిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో భారత భూభాగం లాక్కునేందుకు కొంత ప్రయత్నాలు జరిగాయి. కానీ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వంటి మహానుభావుల చొరవ తో మన భూభాగం మనకు దక్కింది. కానీ బెంగాల్లోనే కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు.
ముఖ్యంగా ఉత్తర బెంగాల్ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. ఈశాన్య రాష్ట్రాల వాతావరణం లో ఉండడంతో ఇక్కడ ప్రగతి నత్తనడక నడుస్తోంది. , ఉత్తర బెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయడం రాజకీయంగా సంచలనం రేపింది. బీజేపీ విజ్ఞప్తిపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. కేంద్రంలోని బీజేపీ బెంగాల్, బెంగాల్ ప్రజల వ్యతిరేక పార్టీ అని విమర్శించింది. బీజేపీ నేతలు గతంలో కూడా ఉత్తర బెంగాల్లోని జిల్లాలను కేంద్ర పాలిత ప్రాంతం, ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ల ద్వారా విభజించడానికి ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ, వారి ప్రయత్నాలు సాగనివ్వమని హెచ్చరించింది.
అయితే, బెంగాల్ విభజనకు తమ పార్టీ వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేస్తుంది. సుకాంత్ మజుందార్ ఉత్తర బెంగాల్ను నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లో చేర్చాలని మాత్రమే ప్రతిపాదించారని, తద్వారా ఉత్తర బెంగాల్ కూడా సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేటాయింపుల నుండి ప్రయోజనం పొందుతుందని సూచించారని వివరణ ఇస్తోంది.
కానీ, ఉత్తర బెంగాల్కు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చాలాకాలంగా ఉంది.
ఇక్కడి ప్రజలు 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఓటు వేశారు. ఉత్తర బెంగాల్ రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు, ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలు, 54 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తర బెంగాల్లోని ఈ ఎనిమిది జిల్లాలు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లతో సరిహద్దులను పంచుకుంటాయి. వ్యూహాత్మక కోణం నుండి కూడా చాలా ముఖ్యమైనవి.
ఈ జిల్లాల్లో కోచే, రాజవంశీ, గూర్ఖా మరియు గిరిజన తెగలు ఉన్నాయి. అంతకుముందు, అఖిల భారతీయ ఆదివాసీ వికాస్ పరిషత్ (ఎబిఎవిపి), గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం), కమతాపూర్ పీపుల్స్ పార్, ఇతరులు ఉత్తర బెంగాల్ను ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనపై బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి మజుందార్ మాట్లాడుతూ బెంగాల్లోని ఉత్తర ప్రాంత జిల్లాలకు, ఈశాన్య రాష్ర్టాలకు ఉన్న పోలికలు గురించి ప్రధాని మోదీని కలిసి వివరించినట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాలను ఈశాన్య రాష్ర్టాల్లో కలపాలని కోరానని తెలిపారు. అదే సమయంలో కూచ్ బెహార్ను దక్షిణ బెంగాల్ నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం చేయాలని బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్ డిమాండ్ చేశారు.కాగా, బెంగాల్ విభజన గురించి బీజేపీ ఇలా డిమాండ్ చేయడం ఇది తొలిసారి కాదు. ఉత్తర బెంగాల్ ప్రాంతం చాలాకాలంగా రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నదని, దానిని ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని 2021లో అప్పటి కేంద్ర మంత్రి జాన్ బర్లా డిమాండ్ చేశారు.
మొత్తం మీద ఉత్తర బెంగాల్ కు కొంతమేర ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ఈశాన్య రాష్ట్రాల హోదా ఇచ్చినట్లయితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీని మీద ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.