పశ్చిమబెంగాల్ మంత్రి పార్థ చటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది. జూన్ 29న ఈడీ అధికారులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ చర్యలకు దిగింది. రెండు రోజులపాటు ఈడీ అధికారులు పార్థ చటర్జీని విచారించారు. విచారణ తరువాత మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు. పార్థ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో 20 కోట్ల రూపాయల నగదును శుక్రవారం ఈడీ స్వాధీనం చేసుకుంది. ఆమెను కూడా శనివారం ఈడీ అదుపులోకి తీసుకుంది.
ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాల్లో కుంభకోణం జరిగినట్టు కేసు నమోదైంది. రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ ఈ నియామకాల ప్రక్రియ నిర్వహించింది. ఉపాధ్యాయుల నియామకం కోసం కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ కేసులో నిందితులు. పార్థ ఛటర్జీ ఓ హై పవర్డ్ సూపర్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీనే కుంభకోణానికి పాల్పడిందని కోల్ కతా హైకోర్టు గతంలో పేర్కొంది. పార్థ ఛటర్జీ మే 18న, మే 25న కూడా సీబీఐ దర్యాప్తునకు హాజరయ్యారు.