లాక్ డౌన్ సమయంలో తన దగ్గర పనిచేసే కూలీలను విమానాల్లో స్వస్థలాలకు పంపిన మంచి మనిషి ఇక లేరు. డిల్లీ రైతు పప్పన్ సింగ్ గెహ్లాట్ ఆత్మహత్య చేసుకున్నారు. 55 ఏళ్ల గెహ్లాట్ అలీపోర్ లోని తనింటి ముందున్న దేవాలయంలో ఉరేసుకుని చనిపోయారు. ఉదయం పోలీసులు ఆయన మృతదేహాన్ని గుర్తించారు. అనారోగ్యంకారణంగానే చనిపోతున్నట్టు ఆయన రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఎన్నడూ ఉత్సాహంగా ఉండే ఆయన చనిపోవడం కలిచివేస్తోందని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఢిల్లీలో పుట్టగొడుగులు సాగు చేసే ఆయన తన దగ్గర పనిచేసే కూలీలను సొంతమనుషుల్లా చూసుకునేవారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో తన దగ్గర పనిచేసే అందరికి విమాన టికెట్లు కొని దగ్గరుండి మరీ వారిని బిహార్లోని స్వగ్రామాలకు పంపారు.కోవిడ్ తగ్గుముఖం పట్టాక తిరిగి విమానంలో వారందర్నీ తీసుకువచ్చారు.
నమ్మకాన్ని కోల్పోవద్దని…తలుచుకుంటే అద్భుతాలు సాధించవచ్చునని అందర్నీ ఎంతో ఉత్సాహపరిచే గెహ్లాట్ మరణాన్ని ఆయన దగ్గర పనిచేసేవారు జీర్ణించుకోలేకపోతున్నారు.