జయ అనుంగు అనుచరుడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంపై వేటువేశారు పళనిస్వామి. పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమితులైన ఎడప్పొడి పళనిస్వామి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీనుంచి ఆయన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఎఐఎడీఎంకేలో ద్వంద్వ నాయకత్వానికి ముగింపు పలికినట్టైంది. పన్నీరు సెల్వం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంతోనే వేటువేసినట్టు పార్టీ జనరల్ కౌన్సిల్లో ప్రకటించారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం, పళని స్వామి ఉన్న పార్టీ కోఆర్టినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పదవులను కూడా రద్దు చేశారు. పార్టీలో అంతర్గత నిర్ణయాల్లో ఏకాభిప్రాయం విషయంలో ఇబ్బందులు, అసంతృప్తులకు ఆస్కారమిస్తున్నందునే రద్దు చేసినట్టు పార్టీ తెలిపింది.
ఏకనాయకత్వానికే మద్దతు అన్నట్టు పళనిస్వామివైపే నాయకులు, కేడర్ నిలిచారు. జనరల్ కౌన్సిల్ మీటింగ్లో ఏకంగా 2500 మంది సభ్యులు ఆయనకే ఓటేశారు. అదే సమయంలో అధికార డీఎంకేకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు చాలామంది సీనియర్లు.
అయితే ఈ నిర్ణయంపై మండిపడ్డారు పళనిస్వామి. కోటిన్నరమంది కార్యకర్తలు తనను ఎన్నికున్నారని…చట్టవిరుద్ధమైన ఈ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు.అటు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్నికకు నాలుగు నెలల్లో అంతర్గత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన కీలక భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో టాప్ పదవితోపాటు పలు పదవులకు సంబంధించిన పలు మార్పులు తీసుకొచ్చారు. 10 ఏళ్ల ప్రాథమిక సభ్యత్వం కలిగిన వ్యక్తే పార్టీ ఉన్నత పదవులకు అర్హుడనే నిబంధననూ జాబితాలో చేర్చారు.
అటు పన్నీర్ సెల్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎడప్పాటి పళనిస్వామి సారధ్యంలో పార్టీ జనరల్ సెక్రటరీ సమావేశంపై స్టే విధించాలంటూ ఓపీఎస్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్ట్ తోసిపుచ్చింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్ట్ సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కీలక తీర్పునిచ్చింది. అటు పార్టీ నాయకులు కేడర్ సైతం ఏకపక్షంగా మద్దతు పలకడంతో పళనిస్వామి ఒక్కరే పార్టీ అధినేతగా ముందుగా సాగనున్నారు.,