అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల సమీపంలోని గోల్లాపూర్లో
పంచముఖి హనుమాన్ విగ్రహ పున ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. శివలింగం, నంది, గణపతి, అన్నపూర్ణాదేవి విగ్రహాలతో పాటు.. నవగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో మూడురోజులపాటు కార్యక్రమాలు జరిగాయి.
సహ్యాద్రి పర్వత పంక్తులలో నెలవైన పంచముఖి హనుమాన్ దేవాలయాన్ని నిత్యం భక్తులు దర్శించుకుంటారు. 12 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏటా జాతర జరుగుతుంది. జాతర సమయంలో అదిలాబాద్ జిల్లా నుంచే కాక తెలంగాణ అన్నిజిల్లాల నుంచి… సరిహద్దు మహారాష్ట్ర నుంచి కూడా వేలాదిమంది భక్తులు పంచముఖి హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలను దర్శించుకుని గోమాత సేవలో తరిస్తారు.ఆలయ పరిసరాలు బాగానే ఉన్నా మరిన్ని సదుపాయాలు కల్పించాలని..ముఖ్యంగా అక్కడి వరకు సరైన రహదారి వ్యవస్థలేక భక్తులు ఇబ్బందిపడుతున్నారని
చందర్ సింగ్ మహారాజ్ తెలిపారు. ప్రభుత్వం, యంత్రాంగం ఇందుకు చొరవతీసుకుని ఆలయ అభివృద్ధికి సహకరించాలని భక్తులు కోరుతున్నారు.