రామేశ్వరంలో ప్రధాని మోదీ పర్యటన…
ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఆసక్తికరంగా నిలిచింది. స్వయంగా సముద్రంలోకి దిగి పవిత్ర స్నానం ఆచరించారు. సముద్రం మధ్య లో ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకొన్నారు. రామేశ్వరం పుణ్యక్షేత్రంలో బావిల దగ్గర స్నానాలు చేయటం ఆనవాయితీ. ఈ పద్దతిని భక్తిప్రపత్తులతో మోదీ పాటించారు. అనంతరం ప్రాచీన కాలం నాటి దేవాలయాన్ని సందర్శించారు. ఇక్కడ శివ లింగాన్ని స్వయంగా రాముడే ప్రతిష్టించాడు కాబట్టి ఇది రామేశ్వరం అయింది. మన హైందవ సంస్క్రతిలో శివ, కేశవ భేదం లేదు అనటానికి రామేశ్వరం క్షేత్రమే ఉదాహరణ. అటువంటి పరమ వైభవ క్షేత్రంలో రాముని భక్తుడైన నరేంద్రమోదీ భక్తి ప్రపత్తులతో పూజలు చేయించారు. అనంతరం అక్కడ సాంస్క్రతిక కార్యక్రమాల్లో పాలు పంచుకొన్నారు.
రామేశ్వరం పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రఖ్యాత పంబన్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఇది పురాతనమైన బ్రిడ్జి గా పేరు గాంచింది. భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా దీనిని చెప్పవచ్చు. దీని గొప్పతనం ఏమిటంటే.. మామూలు సమయాల్లో దీని మీద నుంచి రైళ్లు ప్రయాణం చేస్తాయి. దిగువగా సముద్రంలో ఓడలు వస్తున్నప్పుడు ఈ వంతెన లోని కొంత భాగాన్ని పైకి లేపుతారు. అప్పుడు దిగువగా ఓడ వెళ్లిపోతుంది, తర్వాత రైళ్లు యధావిధిగా ప్రయాణం చేస్తాయి. ఇటువంటి సీ వర్టికల్ బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభం చేశారు. కొత్త వంతెన మీదుగా రామేశ్వరం తాంబరం రైలుకి పచ్చ జెండా ఊపారు.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థను రెట్టింపు అయ్యిందని వెల్లడించారు. ఇంత వేగవంతమైన వృద్ధికి ఒక పెద్ద కారణం మన అద్భుతమైన ఆధునిక మౌలిక సదుపాయాలేనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత పదేళ్లలో రైల్వేలు, రోడ్లు, విమానాశ్రయాలు, నీరు, ఓడరేవులు, విద్యుత్, గ్యాస్ పైప్లైన్లు మొదలైన మౌలిక సదుపాయాల బడ్జెట్ను సుమారు ఆరు రెట్లు పెంచామని చెప్పారు. అందువల్లనే అద్భుతాలు సాధిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. అయినప్పటికీ కొంత మంది ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారని కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు మోదీ చురకలు అంటించారు.