తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ నియామకం దాదాపు ఖరారు అయింది. ఇప్పటిదాకా ఆ బాధ్యత నిర్వహిస్తున్న అచ్చం నాయుడుని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈ మార్పు చేపడుతున్నారు . ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన నేతకే మరోసారి అవకాశం కల్పిస్తున్నారు. ఉత్తరాంధ్ర కావడం, బీసీ వర్గం కావడం మాత్రమే కాకుండా .. చాలా అంశాలు పల్లా నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి.
పల్లా శ్రీనివాస్ తండ్రి సింహాచలం గాజువాక మున్సిపాలిటీగా ఉన్నప్పుడు బలంగా ఎదిగిన నాయకుడు. అప్పట్లోనే ఆయన ముందుచూపుతో చాలాచోట్ల షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టించారు. కేవలం ఈ షాపుల్లో రెంట్ల ద్వారా పల్లా శ్రీనివాస్ కి కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి పడుతుంది. హైదరాబాదు ముంబై మాదిరిగా .. అద్దె డబ్బులు ఎగొట్టేవారు ఉండరు కాబట్టి నికరమైన ఆదాయం ఉంది. సివిల్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన పల్లా శ్రీనివాసు తర్వాత కాలంలో వ్యాపార రంగంలో ప్రవేశించి తండ్రి ఆస్తుల్ని మరింతగా పెంచేశారు.
సాధారణంగా సిటీ శివారులో ఉండే నాయకులకు భూములు ఆక్రమించడం అలవాటుగా ఉంటుంది. కానీ స్థిమితంగా వైట్లో డబ్బు సంపాదించి పెట్టుకున్న పల్లా శ్రీనివాసు అటువంటి పనుల జోలికి పోలేదు. గాజువాక మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి అక్కడ వాళ్లకు పల్లా కుటుంబం బాగా పరిచయం. గాజువాకలో ఎక్కువమంది భారీ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులే ఉంటారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం గాజువాకలో స్థిరపడి ఉంటారు.
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు పల్లా శ్రీనివాస్ పెద్ద ఎత్తున పోరాటం జరిపారు. నిరాహార దీక్షలు ప్రారంభించి ఉద్యోగుల తరఫున తిరగబడ్డారు. ఇది పల్లా శ్రీనివాస్ కి గాజువాక అంతట మంచి పేరు తీసుకుని వచ్చింది. మరోవైపు ఎప్పటినుంచో కార్మికుల పక్షపాతిగా ఉండటంతో గాజువాక నియోజకవర్గంలో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఈలోగా విశాఖపట్నం ని రాజధాని చేస్తానని వైసిపి ప్రభుత్వం ప్రకటించడంతో తెలుగుదేశం గుండెల్లో రాయి పడింది. అప్పటిదాకా విశాఖ తమకు కలిసి వచ్చిన ప్లేస్ గా టిడిపి భావించేది. విశాఖ రాజధాని ప్రకటనతో విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వైసిపికి క్రేజ్ పెరుగుతుందని అంచనా వేసుకున్నారు. ఈ సమయంలో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉన్న పల్లా శ్రీనివాసు మరో కోణాన్ని బయటకు తీసుకువచ్చారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున భూముల కబ్జాలు జరుగుతున్నాయని, ఎక్కడికక్కడ దందాలకు దిగుతున్నారని పల్లా బయటపెట్టారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి రాజధాని తీసుకొని వస్తే వైసీపీ భూ దందాలు మరింత పెరిగిపోతాయని ప్రచారం చేశారు. వ్యక్తిగతంగా పల్లా శ్రీనివాస్ మీద ఎటువంటి భూకబ్జా ఆరోపణలు లేకపోవడం,, వైసిపి నాయకులు భూములు వివాదాల్లో ఇరుక్కోవడం ప్రజల్ని ఆలోచనలో పడేసింది. దీంతో పల్లా శ్రీనివాస్ నాయకత్వంలో విశాఖ జిల్లా అంతా తెలుగుదేశానికి మద్దతుగా నిలిచింది.
పార్టీ కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన మనిషిగా పల్లా శ్రీనివాస్ ను హై కమాండ్ గుర్తించింది. దీనికి తోడు మొన్నటి ఎన్నికల్లో 95 వేల భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. భారీ మెజార్టీ విషయంలో ఆయనే నెంబర్ వన్ గా నిలిచారు.
ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ కి పటం కట్టడం ఖాయం అవుతుంది.