పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, కార్గిల్ యుద్ధ కారకుడు పర్వేజ్ ముషారఫ్ దుబాయ్ లో కన్నుమూశారు. 79ఏళ్ల ఆయన కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో చనిపోయారు. ఆయన భౌతికకాయాన్ని రావల్పిండికి తీసుకువచ్చారు.ముషారఫ్ 1943 ఆగస్టు 11న ఢిల్లీలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం పాకిస్థాన్కు వలస వెళ్లింది. 21ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరిన ముషారఫ్.. సైన్యాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 1999లో కార్గిల్ యుద్ధానికి కుట్రదారైన ముషారఫ్…. తర్వాత నవాజ్ షరీఫ్ సర్కారును కూలగొట్టి సైనిక పాలనను ప్రకటించారు. 2001-08 మధ్య పాక్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో మూడుసార్లు భారత్ వచ్చారు. కానీ శాంతిచర్చలు ఫలించలేదు. దేశద్రోహం కేసు విచారణలో కోర్టు ఆయనను అరెస్టు చేయాలని ఆదేశించింది. అయితే 2016లో బెయిల్ పొందిన ముషారఫ్ చికిత్స సాకుచెప్పి దుబాయి వెళ్లిపోయాడు.