గుజరాత్ సూరత్ లో కొందరు నిర్వహించతలపెట్టిన పాకిస్తానీ ఫుడ్ ఫెస్టివల్ ను స్థానిక బజరంగదళ్ నాయకులు సహా స్థానికులు అడ్డుకున్నారు. ఫెస్టివల్ కు ప్రచారం కల్పిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించారు. పలు హిందుహక్కుల సంఘాలూ నిరసన వ్యక్తం చేశాయి. రెస్టారెంట్ యజమానికి పలువురు ఫోన్లు చేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాకిస్తాన్ ఫుడ్ ఫెస్టివల్ అని పెట్టినందుకు క్షమాపణ చెప్పిన అతను దాన్ని సీఫుడ్ ఫెస్టివల్ గా మార్చాడు. డిసెంబర్ 12నుంచి 22 మధ్య ‘టేస్ట్ ఆఫ్ ఇండియా’ అనే పేరుతో పలు రెస్టారెంట్లు కలిసి ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా సూరత్ రింగ్ రోడ్లోని పాత సబ్-జైలు సమీపంలో ఒక హోర్డింగ్ను ఉంచారు. అందులో పాకీస్తానీ ఫుడ్ ఫెస్టివల్ అని ఉంది. దీంతో బజరంగదళ్ సహా, హిందూసంస్థల ప్రతినిధులు దాన్ని చించి తగులపెట్టారు.
పాకిస్తాన్ పేరు పెట్టడం తప్పేనని అంగీకరించిన యజమాని సందీప్ దావర్ ఇకముందు అలాంటి పొరపాటు చేయనని ప్రమాణం చేశాడు. పాకిస్తాన్తో సంబంధం ఉన్న వంటకాలు ఉన్నందునే ఆ పేరు పెట్టామని చెప్పాడు. బయట ప్రచారం జరుగుతున్నట్టు పాకిస్తానీ చెఫ్ లు ఎవరూ ఫెస్టివల్ కు రావడం లేదన్నాడు. సందీప్ తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పడంతో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని బజరంగదళ్ ప్రతినిధులు తెలిపారు.