గత జులై నెల మధ్యలో పాకిస్థాన్ నావీ కి చెందిన వార్ షిప్ ఒకటి గుజరాత్ తీరంలోని భారత జలాలలోకి ప్రవేశించింది. అయితే భారత్ కోస్ట్ గార్డ్ కి చెందిన డోర్నియర్ నిఘా విమానం ఒకటి మన దేశ ప్రాదేశిక జలాలలోకి ఏదో నౌక ప్రవేశించి ప్రయాణిస్తున్నట్లు గుర్తించింది.
వెంటనే మొదటి డోర్నియర్ నిఘా విమానంకి తోడుగా దగ్గరలోనే ఉన్న ఎయిర్ బేస్ నుంచి మరో డోర్నియర్ నిఘా విమానాన్ని పంపించారు విషయం ఏమిటో తెలుసుకొమ్మని. అప్పటికే గాల్లో ఉన్న మొదటి డోర్నియర్ నిఘా విమానం అంతర్జాతీయ జలాల నుంచి మన ప్రాదేశిక జలాలోకి ప్రవేశించిన నౌకని PNS ఆలంగీర్ గా గుర్తించింది. ముందు జాగ్రత్త చర్యగా భారత నావీ అధికారులు గుజరాత్ తీరం నుంచి అంతర్జాతీయ జలాలకి మన ప్రాదేశిక జలాలకి మధ్యన 5 నాటికల్ మైళ్ళ ప్రాంతాన్ని భారత జాలర్లు చేపలు పట్టడానికి అనుమతి ఇవ్వటం లేదు గత కొంత కాలంగా ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం క్లియర్ గా ఉండాలి అనే ఉద్దేశ్యంతో. లేకపోతే దూరం నుంచి ఏది చేపలు పట్టే పడవో అది మన దేశానిదా లేక పాకిస్థాన్ దేశానిదా అనే సందిగ్ధం లో పడకుండా ఉండడానికి ముందుజాగ్రత్త గా తీసుకున్న చర్య అది. అయితే పాకిస్థాన్ కి చెందిన PNS ఆలంగీర్ అనే వార్ షిప్ ఎప్పుడయితే మన ప్రాదేశిక జలాలోకి ప్రవేశించిందో వెంటనే అప్రమత్తం అయిన కోస్ట్ గార్డ్ నిఘా డోర్నియర్ విమానం వైర్లెస్ ద్వారా పాకిస్థాన్ PNS ఆలంగీర్ వార్ షిప్ కి సందేశం పంపింది. మీరు భారత దేశ ప్రాదేశిక జలాలోకి ప్రవేశించారు కాబట్టి వెనక్కి వెళ్లిపొమ్మని అంటూ . కానీ కోస్ట్ గార్డ్ సందేశంని విని కూడా PNS ఆలంగీర్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ సారి రెండో డోర్నియర్ నిఘా విమానం కూడా మొదటి దానితో చేరిపోయింది. అప్పుడు మొదటి డోర్నియర్ PNS ఆలంగీర్ అనే వార్ షిప్ చుట్టూ ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఈ సారి మరింత తీవ్రంగా హెచ్చరిస్తూ సందేశాలు పంపింది PNS ఆలంగీర్ అనే వార్ షిప్ కి. అయినా పాకిస్థాన్ PNS ఆలంగీర్ అనే వార్ షిప్ కెప్టెన్ నిశ్శబ్దంగా ఉన్నాడు తప్పితే మనం చేసిన హెచ్చరికలకి ఏ మాత్రం స్పందించలేదు. ఎప్పుడైతే రెండో డోర్నియర్ ని చూశారో PNS ఆలంగీర్ అనే వార్ షిప్ సిబ్బంది ఈ సారి ప్రతిస్పందిస్తూ తిరిగి అంతర్జాతీయ జలాలవైపు తమ షిప్ ని మళ్లించారు. కోస్ట్ గార్డ్ నిఘా డోర్నియర్ విమానాలకి ఎలాంటి రక్షణ వ్యవస్థ కానీ ఆయుధాలు కానీ ఉండవు. ఇవి కేవలం కాపలా కాయడానికి మాత్రమే వాడతారు. పరిస్థితి అదుపులోకి రాకపోతే వెంటనే నావీ రంగంలోకి దిగుతుంది. డోర్నియర్ నిఘా విమానం నుంచి మాట్లాడే ప్రతి మాట కూడా అటు కోస్ట్ గార్డ్ కమాండ్ సెంటర్ తో పాటు ఇటు భారత నావీ కమాండ్ సెంటర్ కి ఏకకాలంలో వెళతాయి అంటే ఒకే సమయంలో కోస్ట్ గార్డ్ తో పాటు భారత నావీ కూడా సంభాషణలని వినగలుగుతాయి. పరిస్థితి అదుపులోకి రాకపోతే వేరే ఎవరూ చెప్పకుండానే నావీ ప్రతిస్పందించి తగిన చర్య తీసుకుంటుంది.
ఈ ఘటన మీద ANI వార్తా సంస్థ అడిగిన ప్రశ్నలకి భారత్ నావీ అధికారులు కానీ.. కోస్ట్ గార్డ్ అధికారులు కానీ ఎలాంటి జవాబు ఇవ్వకుండా దాటవేశారని తెలుస్తున్నది. అయితే పాకిస్థాన్ మాత్రం ఒక ప్రయోగం చేసి చూసింది అనే చెప్పాలి. గుజరాత్ దగ్గర అరేబియా సముద్ర తీరప్రాంతం అత్యంత కీలమయినది. మరీ ముఖ్యంగా గుజరాత్ తీరానికి దగ్గరలో ఉన్న ద్వారకతో పాటు సర్ క్రీక్ ప్రాంతం భద్రత దృష్ట్యా అత్యంత కీలమైనవి. ఈ ప్రాంతాల మీద నిత్యం నిఘా కొనసాగుతూనే ఉంటుంది. ముంబై దాడులకి గాను ఇదే ప్రాంతం నుంచి పాకిస్థాన్ నుంచి చిన్న పడవల ద్వారా ఆయుధాలతో పాటు ఉగ్రవాదులు చొరబడ్డారు. ఏదో ఒక రోజున ఒక సమయంలో సెక్యూరిటీ లాప్స్ ఉండవచ్చు అనే ఆలోచనతో పాకిస్థాన్ భారత ప్రాదేశిక జలాలలోకి ప్రవేశించి మనం ఎంత అప్రమత్తంగా ఉన్నామో అని పరీక్షించడానికి చేసిన ప్రయత్నంగా PNS ఆలంగీర్ ని పంపించింది. ఇది మన బ్రహ్మోస్ సూపర్ సానిక్ మిసైల్ పొరపాటున పాకిస్థాన్ లోకి ప్రవేశించి అక్కడ కూలిపోయిన ఘటనకి ప్రతీకారంగా చేసిన చర్య అనుకోవచ్చు. పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిన బ్రహ్మోస్ మిసైల్ ని ఇంటెర్సెప్ట్ చేసి దానిని మొదట్లోనే కూల్చడానికి పాకిస్థాన్ ఎలాంటి ప్రయత్నం చేయలేకపోయింది ఎందుకంటే ఆ రూట్ లో పాకిస్థాన్ గ్రౌండ్ రాడార్లు లేవు కనుక. దీన్ని కమ్యూనికేషన్ లూప్ హోల్ అంటారు, అంటే ఒక రాడార్ పరిధికి పక్కనే ఉన్న మరో రాడార్ పరిధికి మధ్యలో ఉండే ప్రాంతాన్ని లూప్ హోల్ అంటారు. యుద్ధ తంత్రంలో భాగంగా శత్రు దేశంలోకి చొచ్చుకుపోవడానికి యుద్ధ విమానాలు ఇలాంటి కమ్యూనికేషన్ లూప్ హోల్ కోసం వెదుకుతాయి. కొంచెం విస్తృతం గా చెప్పాలి అంటే వర్షం పడుతున్నప్పుడు రెండు గొడుగులని పక్క పక్కనే పట్టుకొని నిలుచున్న ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ గొడుగుల మధ్య ఉండే దూరాన్ని లూప్ హోల్ గా పరిగణిస్తారు. మన బ్రహ్మోస్ కూడా అలాంటి లూప్ హోల్ ద్వారా ప్రయాణించింది. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే పద్ధతిని అనుసరించి అంతర్జాతీయ జలాల నుంచి భారత ప్రాదేశిక జలాలోకి ప్రవేశించిన తరువాత ఎంతసేపట్లో కోస్ట్ గార్డ్ తన రాకని గుర్తించగలిగింది అనే దాన్ని అంచనా వేయడానికే ఆ పని చేసింది. అంటే ఒక గంట తరువాత కోస్ట్ గార్డ్ పసిగడితే ఆ గంట సమయాన్ని చిన్న పడవల ద్వారా భారత్ లోకి ప్రవేశించడానికి ఉపయోగించుకోవచ్చు అనే ఎత్తుగడతో ఆ పని చేసింది. సాధారణంగా సర్ క్రీక్ ప్రాంతంలో ఎక్కువగా చొరబాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం లో ఎక్కువగా పాకిస్థాన్ కి చెందిన చేపలు పట్టే పడవలు డ్రగ్స్,ఆయుధాలని తీసుకొని గుజరాత్ తీర ప్రాంతానికి దగ్గరలో మన దేశ స్మగ్లర్లకి అందచేసి వెళ్లిపోతుంటాయి.
ఈ సంఘటన జరిగింది జులై నెల రెండు, మూడవ వారాల మధ్యన.
ఇలాంటి టాక్టిక్స్ ని వాడేది చైనా మాత్రమే. గతంలోనూ ఇప్పడు కూడా చైనా చేపలు పట్టే మర పడవలు తరుచూ తమ దేశ ప్రాదేశిక జలాలని దాటి పక్క దేశాల జలాలోకి చొరబడి చేపలు పట్టడం ఆయా దేశాల కోస్ట్ గార్డ్ లు అడ్డుకోవడానికి వచ్చినప్పుడు అక్కడికి కొంచెం దూరంలో ఉండే చైనా యుద్ధ నౌకలు వచ్చి తమ జాలర్లకి మద్దతుగా తమ యుద్ధ నౌకతో చిన్న చిన్న స్పీడ్ బొట్లలో వచ్చిన ఆయా దేశాల కోస్ట్ గార్డ్ అధికారులని బెదిరించి మరీ చేపలు పట్టుకొని తీసుకెళ్లడం పరిపాటి. చైనా చేపల పడవలు చిన్నవి అనుకుంటే పొరపాటు. దూరం నుంచి చూస్తే అదేదో పెద్ద యుద్ధ నౌకలాగా కనిపిస్తాయి.
ఇదే తరహాలో పాకిస్థాన్ కి చెందిన PNS ఆలంగీర్ కూడా గుజరాత్ తీరంలో మన జలాలోకి ప్రవేశించే సమయంలో తోడుగా అక్రమ ఆయుధాలని, డ్రగ్స్ ని స్మగుల్ చేసే చిన్న పడవలని తనతో తీసుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయి ఉండవచ్చు.
ఇప్పుడు శ్రీలంక దక్షిణ రేవు అయిన హంబన్ తోట లో చైనా నిఘా నౌక తిష్ట వేయడం మరో వైపు చైనా తయారీ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ PNS తైమూర్ కొలంబో రేవులో తిష్ట వేయడంని ఎలా అర్ధం చేసుకోవాలి ? ఒక పక్క తైవాన్ ని అష్ట దిగ్బంధనం చేసి మరో వైపు మనల్ని బెదరించే స్థాయికి చైనా ఎందుకు దిగజారింది ?
క్వాడ్ ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు పసిఫిక్ మహా సముద్రంలో యుద్ధ తరహా విన్యాసాలు చేస్తున్నాయి. కానీ భారత్ మాత్రం తన యుద్ధ నౌకలని అక్కడికి పంపలేదు.
ఇప్పటికే మూడు సార్లు పాకిస్థాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి అనుమతి ఇచ్చిన నరేంద్ర మోదీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే భయం చైనాకి ఉండి ఉండవచ్చు. ముందు జాగ్రత్త చర్యగా బాలిస్టిక్ మిసైల్ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తుండవచ్చు.
అయితే గత గురువారం మహారాష్ట్ర లోని రాయగడ్ జిల్లాలోని సముద్ర తీరంలో దొరికిన చిన్న పడవ [Yacht] ఒక ఆస్ట్రేలియన్ దంపతులదని యూరోపు కి వెళుతూ మధ్యలో సముద్ర అలలకి తట్టుకోలేక అరేబియా సముద్రంలోని మన దేశ తీరానికి వచ్చిందని ప్రాధమిక విచారణలో తెలిసింది. ఆ నౌకలో దొరికిన రెండు AK-47 అస్సాల్త్ రైఫిల్స్, బులెట్స్ ఉన్న మాగజైన్లు దొరికాయి కానీ సముద్ర దొంగల బారి నుంచి రక్షణ కోసం ఆస్ట్రేలియన్ దంపతులు వాటిని తమతో ఉంచుకున్నట్లుగా తెలుస్తున్నది. PNS ఆలంగీర్ తో ఈ ఘటనకి సంబంధంలేదు. PNS ఆలంగీర్ ఘటన మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన తరువాత జరిగింది అని గుర్తించాలి.
~ పార్ధసారధి పోట్లూరి