భారత భూభాగంలోకి వచ్చి ఎంతో కొంత విధ్వంసం సృష్టించాలని నాలుగు రోజులుగా పాకిస్థాన్ తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ ఈ శ్రమ ఏమాత్రం ఫలించడం లేదు. దీని వెనక భారత సాయుధ బలగాల కృషితో పాటుగా మరో సంస్థ ప్రయత్నం కూడా దాగింది. అదే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.
భారత్ సరిహద్దుల్లో శత్రువు కదలికలను పసి కట్టడానికి పదికి పైగా ఉపగ్రహాలు పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ అన్నారు. కీలకమైన నిఘా డేటాను అందించడం ద్వారా పౌరులను రక్షించడంలో ఈ ఉపగ్రహాలు వ్యూహాత్మక పాత్ర పోషిస్తాయని తెలిపారు.మణిపూర్లోని ఇంఫాల్లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. భారతదేశపు 7,000 కిలో మీటర్ల సముద్ర తీరం, ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం గురించి ఆయన వివరించారు.
దేశ భద్రత్రలో ఇస్రో పాత్ర గురించి ఆయన కొంతమేర వెల్లడించారు.
“మన దేశ భద్రతను నిర్ధారించుకోవాలంటే, మన ఉపగ్రహాల ద్వారా సేవలందించాలి. మన సముద్ర తీర ప్రాంతాలను మనం పర్యవేక్షించాలి. మనం మొత్తం ఉత్తర భాగాన్ని నిరంతరం పర్యవేక్షించాలి” అని నారాయణన్ అన్నారు. శాటిలైట్లు, డ్రోన్ టెక్నాలజీ లేకుండా భారతదేశం పూర్తి భద్రతా కవరేజీని సాధించలేమని నారాయణన్ స్పష్టం చేశారు.
అయితే ఇది సున్నితమైన సబ్జెక్టు కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఇస్రో చైర్మన్ ఇష్టపడలేదు. భారత సమాజం భద్రతకు ఇస్రో 24 గంటలు కృషి చేస్తోందని మాత్రం ఆయన వివరించారు.