పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు పలువురు. 2020 సంవత్సరానికి 119మందిని పద్మ పురస్కారాలు వరించాయి. వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. 16 మందికి మరణానంతరం పురస్కారం ప్రకటించారు. స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషన్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, క్రీడాకారుడు జహీర్ ఖాన్, సింగర్ అద్నాన్ సమీలకు పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. మరణానంతరం అరుణ్ జైట్లీకి పద్మ విభూషన్, సుష్మా స్వరాజ్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు పద్మ విభూషన్ ప్రకటించారు. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్ అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు చెందిన వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురానికి చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్రావు, తొలి మృదంగ కళాకారిణి విజయవాడకు చెందిన నిడుమోలు సుమతి రాష్ట్రపతి చేతులమీదిగా పద్మ శ్రీ పురాస్కారాన్ని స్వీకరించారు.
తెలంగాణకు చెందిన గుస్సాడి కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన పురస్కార ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్రం మంత్రి అమిత్ షా సహా పలువురు హాజరయ్యారు.