తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యల్ని నిరసిస్తూ అధికార టీఆర్ఎస్ పిలుపు మేరకు బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. మోదీని తెలంగాణ వ్యతిరేకిగా ద్రోహిగా అభివర్ణిస్తూ ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నాయకులు. ఎక్కడికక్కడ మోదీ దిష్టిబొమ్మలను ధ్వంసం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో గన్ పార్క్ దగ్గర టీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. తెలంగాణ గుజరాత్ ను మించి అభివృద్ధిలో దూసుకెళ్తుంటే మోదీ తట్టుకోలేకపోతున్నారని కేటీఆర్ సహా ఇతర మంత్రులు మండిపడ్డారు. జనగామలో టీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీని బీజేపీవాళ్లు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దాదాపు అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
అటు మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా నిరసనలు కొనసాగాయి. పార్టీశ్రేణులు మోదీ, బీజేపీ దిష్టిబొమ్మల్నిదహనం చేశాయి. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అమరవీరుల ఆత్మక్షోభించేలా మాట్లాడిన మోదీ తెలంగాణకు క్షమాపణ చెప్పాలన్నారు.