యూపీలో బయటపడుతున్న అఖిలేష్ అవినీతి బాగోతాలు
జనాభా పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ లో అవినీతి కూడా ఆ స్థాయిలోనే జరిగింది. చాలా కాలం పాటు ఈ రాష్ట్రంలో అధికారం చెలాయించిన సమాజ్ వాదీ పార్టీ జమానాలో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పింఛన్ కుంభకోణం జరిగిందని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. ఆనాటి ఈ స్కాం జరిగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కుంభకోనం విలువ రూ.1000 కోట్లకు పైమాటే అని సర్కార్ తెలిపింది.
పింఛన్ల పేరుతో జరిగిన దందాలో ఏకంగా 43 వేల మంది మరణించిన వారి పేరు మీద నిధులు విడుదల అవుతున్నాయి. అంటే చనిపోయిన వాళ్లు పింఛన్లు పొందుతున్నారన్న మాట. మరో 4 లక్షల మంది అనర్హులకు కూడా ఠంచనుగా పింఛన్లు అందుతున్నాయి. యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం ప్రజల సొమ్ము ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంది. దుర్వినియోగం కాకుండా చూస్తున్నది. గతంలో జరిగిన అవినీతి కుంభకోణాలను వెలికి తీస్తున్నది.
ములాయం సింగ్ యాదవ్ పెట్టిన పార్టీ ఇప్పుడు అఖిలేష్ యాదవ్ చేతిలో ఉంది. తండ్రీకొడుకులు ముఖ్యమంత్రులుగా చాలా కాలం పాటు పాలన సాగించారు. ములాయం సింగ్ యాదవ్ పై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. అఖిలేష్ పైనా చాలా ఆరోపణలున్నాయి. వాటిలో నిజానిజాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు పింఛన్ స్కాం వంతు. రేపు ఇంకే కుంభకోణం బయట పడుతుందో చూడాలి.