మా నాయనమ్మ చేసింది తప్పే.. ఒప్పుకుంటున్నాను..!
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తన నాయనమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పెట్టిన ఎమర్జెన్సీ విషయంపై స్పందించారు. అప్పట్లో అత్యవసర పరిస్థితిని విధించడం ముమ్మాటికి తప్పేనని రాహుల్ గాంధీ అన్నారు. అయితే అప్పటి సమయంలో జరిగిన దానికి.. ప్రస్తుతం మోదీ సర్కార్ పాలనలో దేశంలో జుగుతున్నదానికి మౌలికంగా చాలా తేడా ఉందంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితులు క్లిష్టంగా మారాయని.. దేశ సంస్థాగత నిర్మాణాన్ని తమ గుప్పిట్లో తీసుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయలేదన్నారు.
భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కౌశిక్ బసుతో రాహుల్ గాంధీ వర్చువల్ మీట్లో మాట్లాడారు. ఈ క్రమంలో కౌశిక్ ఎమర్జెన్సీ విషయంపై అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాదానమిచ్చారు. ప్రస్తుతం దేశంలోని అన్ని సంస్థల్లో ఆర్ఎస్ఎస్ తన వారిని నింపేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించినప్పటికీ.. సంస్థాగత నిర్మాణంలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యక్తుల బెడద మాత్రం తొలగదన్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఆయనతో ఓ సమయంలో సంభాషించినప్పుడు.. తాను సీఎంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు ఎవ్వరూ కూడా తన మాట వినడం లేదని.. వారంతా ఆర్ఎస్ఎస్ వాళ్లని తెలిసిందని కమల్ నాథ్ చెప్పినట్లు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.