ఓ దళిత కుటుంబంతో బలవంతంగా గొడ్డుమాంసం తినిపించిన ఘటన జార్ఖండ్ లో జరిగింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి ఆ కుటుంబం ఒప్పుకోకపోవడమే అందుకు కారణం. మతం మారనందుకు చివరకు ఆ కుటుంబాన్నే ఊరినుంచి వెలేశారు.
జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. వామపక్ష తీవ్రవాదం, క్రైస్తవ మిషనరీల ప్రభావం అక్కడ ఎక్కువైంది. ముఖ్యంగా గతేడాది లాక్ డౌన్ సమయం నుంచీ మిషనరీ మాఫియా ఆగడాలు పెరిగాయని స్థానికులంటున్నారు. పట్టణాలనుంచి గుంపులుగా వచ్చిన మతమార్పిడి బృందాలు అమాయక గ్రామప్రజలను మతం మారాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇక ఎస్సీలనైతే రకరకాలుగా బెదిరిస్తున్నారు. తాము చెప్పిన మాట వినకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తుండడంతో చాలామంది లొంగిపోతున్నారు. ఒత్తిడికి తలొగ్గి క్రైస్తవంలోకి మారుతున్నారు.
గుమ్లా జిల్లా కేంద్రంనుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉండే గడ్డోలి బ్లాక్ లో ఉండే కుటుంబాల్లో సగానికిపైగా ఇప్పటికే మతం మారారు. కొందరు నిరాకరిస్తున్నారు. అలాంటి వారిమీద మతమార్పిడి ముఠా సాగిస్తున్న అరాచకకాండ అంతా ఇంతా కాదు. అక్కడి 55 కుటుంబాల్లో దాదాపు 30 కుటుంబాలు ఇప్పటికే క్రైస్తవంలోకి వెళ్లాయి. గత 15 ఏళ్లుగా మతమార్పిడి రాకెట్ అక్కడ పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన ఓ రెండు కుటుంబాలు మాఫియాతో తలపడుతున్నాయి. మతం మారేందుకు వారు ససేమిరా అంటున్నారు.
దీంతో అప్పటికే మతం మారిన గ్రామస్థులను వారిపైకి ఉసిగొల్పుతున్నారు. సలిక్ గోప్ అనే వ్యక్తి కుటుంబం మొత్తాన్ని ఆరునెలల పాటు బహిష్కరిస్తున్నట్టు క్రైస్తవ మత పెద్దలు ప్రకటించారు. చాలాకాలంగా ఆ కుటుంబానికి వారినుంచి నిత్యం బెదిరింపులే.
సలిక్ గోప్ కుమారుడు బుధేశ్వర్ ఆరునెలలుగా స్కూలుకు కూడా వెళ్లడం లేదు. పనికి వెళ్లడం లేదు. ఆ ఊరి బావినీ వాడుకోనీయడం లేదు. గొడ్డుమాంసం తినాలని నిరంతరం వారిమీద ఒత్తిడి తీసుకువస్తున్నారు.వాళ్ల సొంతపొలంలో సేద్యాన్నీ చేసుకోనీయడం లేదు. కొంతకాలంగా మిషనరీ మాఫియా ఆ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ తమలాంటి వాళ్లని వేధింపులకు గురి చేస్తున్నారని సలిక్ గోప్ ఆందోళన వ్యక్తం చేశాడు. అయినా మాఫియా బెదిరింపులకు తాను తలొగ్గబోనని అంటున్నారు. అయితే స్థానిక పోలీసుల సమక్షంలోనే వారి అరాచకాలు కొనసాగుతుండడం దారుణం. పోలీసులకు చెప్పుకున్నా ప్రయోజనం ఉండదని…ఎవరైనా ఎదిరించే ప్రయత్నం చేస్తే అన్నివిధాలా హింసిస్తారని మహిళలూ ఏడుస్తూ చెబుతున్నారు.
గతంలో ఓ మహిళా ఆరోగ్య కార్యకర్తను కూడా మతమార్పిడి మాఫియా బెదిరించింది. మతం మారాలని ఒత్తిడి చేసింది. దీంతో ఆమె వారిపై ఫిర్యాదు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఎస్సీఅయిన ఆమెపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గ్రామస్తులతోనూ క్సైస్తవ మాఫియా తమపై దాడిచేయించిందని బాధితురాలు వాపోయింది.