రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాల అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది. తమ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగమంత్రి యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఆయన అభ్యర్థిత్వానికి అన్నిపార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 27వ తేదీన యశ్వంత్ సిన్హా నామినేషన్ వేయనున్నారు. అంతకుముందు పార్లమెంట్ హౌస్ ఎనెక్స్ లో విపక్షాల నేతలు సమావేశమయ్యారు. శరద్ పవార్, మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేష్, సీతారాం ఏచూరి, డి.రాజా, ప్రఫుల్ పటేల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ సూచన మేరకు యశ్వంత్ టీఎంసీకి రాజీనామా చేశారు. బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసిన సిన్హా మోదీతో విభేదించి బయటకు వచ్చారు. గతేడాది టీఎంసీలో చేరారు.
ఐఏఎస్ అధికారి అయిన సిన్హా ఉద్యోగానికి రాజీనామా చేసి 1984లో బీజేపీలో చేరారు. పలుమార్లు పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు. వాజ్ పేయికి అత్యంత సన్నిహితుడైన యశ్వంత్ సిన్హా ఆయన కేబినెట్లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉండగా ఆర్థికమంత్రిగా సేవలందించారు. అయితే యశ్వంత్ సిన్హా కుమారుడు మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు.