కర్నాటక శివమొగ్గలోని పురాతన కోటే మరికాంబ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ జాతర సందర్భంగా హిందూ విక్రేతలకు మాత్రమే దుకాణాలు కేటాయించాలని నిర్ణయించింది. ఐదు రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఉడుపి లోని మరిగుడి ఆలయ పాలకమండలి కూడా ఇదే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 22న మరికాంబ జాతర మొదలుకానుంది. ఇటీవలి కాలంలో హర్ష హత్య సహా పలు ఘటనల నేపథ్యంలో వివిధ హిందూసంఘాల ప్రతినిధులు ఆలయ పాలకమండలికి ఈ విషయమై విజ్ఞప్తి చేశాయి. హిందువేతరులకు దుకాణాలు పెట్టుకునే అవకాశం ఇవ్వవద్దని కోరాయి. దీంతో ఉత్సవ కమిటీ ఇప్పటికే ఉన్న టెండర్లను రద్దు చేసి ఆయా సంఘాల సిఫారసుల ఆధారంగా దుకాణాలు కేటాయించాలని నిర్ణయించింది.
రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కోటే మరికాంబ జాతరకు పొరుగున ఉన్న నగరాలు, జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. 2020 ఫిబ్రవరిలో జాతర జరిగింది. అయితే మతాలకు అతీతంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ముస్లింలు, క్రైస్తవులు సైతం దేవతకు ‘హరకే’ మొక్కులు సమర్పిస్తారు. ఇక ఆలయ కమిటీ దుకాణాల నిర్వహణలో టెండర్ల ప్రక్రియ ఆధారంగా హిందువేతరులకూ కేటాయించేవారు. అయితే హిందూసంఘాలనుంచి వ్యతిరేకత రావడంతో ఈ సారి టెండర్లు రద్దు చేశారు.
తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని…కానీ లక్షలాదిమంది పాల్గొనే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని హిందూసంస్థల డిమాండ్ కు అంగీకరించామని కమిటీ ముఖ్యులు తెలిపారు.
ఇటీవలే హిందుసంస్థకు చెందిన కార్యకర్త హర్షను కొందరు దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇక దుమారం రేపిన హిజాబ్ వివాదంలో కోర్టు తీర్పునూ సవాల్ చేస్తూ కొందరు ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో హిందూసంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. దీంతో హిందూ ఆలయాలు, జాతరల్లో వారి ప్రమేయం లేకుండా చూడాలని నిర్ణయించినట్టు సమాచారం.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)