దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఒకే పర్మిట్ విధానం నేటి నుంచే అమల్లోకి రానుంది. రాష్ట్రాలు మారినా ఎలాంటి చెల్లింపులు లేకుండానే వ్యక్తిగత వాహనాల్లో రాకపోకలు సాగించవచ్చు. ‘వన్ నేషన్-వన్ పర్మిట్’ విధానంలో భాగంగా ‘ఆలిండియా టూరిస్ట్ వెహికిల్స్ పర్మిట్ – 2021’ మార్గదర్శకాలను కేంద్రం రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వాటిని అమలుచేయాలని నిర్ణయించింది. అంతరాష్ట్ర రాకపోకలు సాగించే క్యాబ్ల నుంచి బస్సుల వరకు ఒకే పర్మిట్ వర్తిస్తుంది.
ఒక్కసారి ఫీజు చెల్లిస్తే ఏడాదిపాటు వాహనాల్లో తిరగొచ్చు. 9 సీట్ల లోపు సామర్థ్యమున్న నాన్ ఏసీ వాహనాలకు రూ.15 వేలు, ఏసీ వాహనమైతే రూ.25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 23 సీట్ల కంటే తక్కువ ఉన్న మినీ బస్సులు, ఇతర వాహనాలు నాన్ ఏసీ అయితే ఏడాదికి రూ.50 వేలు, ఏసీ అయితే రూ.75 వేలు చెల్లించాలి. 23 సీట్లకంటే ఎక్కువ ఉన్న నాన్ ఏసీ బస్సులైతే టూరిస్ట్ పర్మిట్ కోసం ఏడాదికి రూ.2లక్షలు, ఏసీ బస్సు అయితే రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.