నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి.. మరో ఇద్దరు మిస్సింగ్.
భారత్-నేపాల్ సరిహద్దుల్ఓ మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.యూపీలోని ఫిల్బిత్ ప్రాంతంలోని హజారా ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు నేపాల్ వెళ్లారు. అయితే వారు అక్కడ సరిహద్దు ప్రాంతంలో నేపాల్ పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన తర్వాత మరో ఇద్దరు వ్యక్తుల ఆచూకీ లభించలేదు. వారిద్దరూ సరిహద్దు ఇవతలికి వచ్చారా..? లేదా నేపాల్లోనే ఉండిపోయారా..? అన్నది తెలియలేదు. ఫిల్బిత్ ఎస్పీ జై ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హజారా ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు నేపాల్ వెళ్లారని.. అయితే అక్కడి నుంచి భారత సరిహద్దువైపు వచ్చారని.. ఈ క్రమంలోనే నేపాల్ సాయుధ బలగాలతో ఘర్షణకు దిగారని తెలిపారు. ఈ క్రమంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఒక భారతీయుడు మరణించినట్లు తెలిపారు. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో మరో యువకుడు భారత్లోకి ప్రవేశించగా.. మరో వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదన్నారు. అయితే భారత్లోకి వచ్చిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదని ఎస్పీ ప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. నేపాల్ పోలీసులతో ఫిల్బిత్ పోలీసులు సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారన్నారు.