ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ప్రతిపక్ష నేతలు పోటీపడి విమర్శలు గుప్పిస్తున్నారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నిక ఖాయం అని ఖరారవడంతో ప్రతిపక్షాలు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నాయి. దీంతో ఈ విమర్శలు జోరు మరింత పెంచేస్తున్నాయి. ప్రతిపక్షాల తిట్లు తనకు మరింత బలాన్ని కలిగిస్తున్నాయని ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. ఇప్పటిదాకా నూట ఒక్క రకాలుగా తనని దుర్భాషలాడారని,, ఈ విషయాన్ని ఒక పార్లమెంటు సభ్యుడు లెక్కలతో సహా అందించారని మోదీ వివరించారు. శిశుపాలుడు వంద తప్పులు దాటిపోయాక,, ఏమి జరిగిందో అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. తప్పుడు మార్గంలో నడవటానికి అలవాటు పడిన అక్రమార్కుల తప్పులు అన్నీ సవరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల వైఖరిని ప్రధానమంత్రి వివరాలతో సహా బయటపెట్టారు. చివరి దశపోలింగ్ ముందు మీడియాతో మాట్లాడారు . ప్రతిపక్షాల ను అణచివేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ వస్తోన్న విమర్శలపై స్పందిస్తూ, . ”అందుకు నిదర్శనం ఏంటని చెత్తను విసిరే వ్యక్తిని అడగండి. నేను ఆ చెత్తను ఎరువుగా మార్చి, ఈ దేశం కోసం మంచి ఉత్పత్తులను అందిస్తాను. పదేళ్లపాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కేవలం రూ.34 లక్షలనే స్వాధీనం చేసుకున్నారు. కానీ గత 10 ఏళ్ల కాలంలో రూ.2,200కోట్లను ఈడీ సీజ్ చేసింది. దేశానికి అన్నికోట్ల రూపాయాలను వెనక్కి తెచ్చిన వ్యక్తిని గౌరవించాలి.. నిందించకూడదు. ఆ డబ్బును దొంగతనం చేసిన వ్యక్తి పట్టుబడిన తర్వాత అరుస్తుంటాడు. మా ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించదు” అని స్పష్టం చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శల్ని మోదీ తిప్పి కొట్టారు.
ఎవరు జైలుకు వెళ్లాలో మోదీ నిర్ణయిస్తారని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..”ఇలాంటి వ్యక్తులు ఈ దేశ రాజ్యాంగం, చట్టంపై అవగాహన పెంచుకోవాలి. నేను ఎవరికి ఏమీ చెప్పనవసరం లేదు” అని చురకలు అంటించారు.
అలాగే పశ్చిమ బెంగాల్లో పార్టీ ప్రదర్శన గురించి ప్రస్తావించారు. ”బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఈసారి మేం అక్కడ మంచి పనితీరు ప్రదర్శిస్తాం. అక్కడ హత్యలు, దాడులు సర్వసాధారణంగా మారాయి. ఇన్ని అకృత్యాల మధ్య.. ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేస్తున్నారు’ అని అన్నారు.
ముచ్చటగా మూడోసారి ఎన్ డి ఏ కూటమి అధికారం దక్కించుకుంటుందని మోదీ జోస్యం చెప్పారు. ప్రతిపక్షాల ఆశలు అడియాసలే అని ఆయన తేల్చి చెప్పారు.