లోక్ సభ లో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి నోరు పారేసుకొన్నారు. అమెరికా భారత్ సంబంధాల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరపున అమెరికాలో మన విదేశాంగ మంత్రి జై శంకర్ లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. సున్నితమైన విదేశీ వ్యవహారలకు సంబంధించి కూడా దురుసుగా మాట్లాడేశారు
కాగా, రాహుల్ గాంధీ ఆరోపణలను విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తప్పు పట్టారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు. ”2024 డిసెంబర్లో నా అమెరికా పర్యటనపై విపక్ష నేత అవాస్తవాలు మాట్లాడారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లోని సెక్రటరీ, ఎన్ఎస్ఏను కలిసేందుకు వెళ్లాను. ఆ తర్వాత మన కాన్సుల్ జనరల్ సమావేశానికి అధ్యక్షత వహించాను. ఏ దశలోనూ ప్రధానమంత్రికి ఆహ్వానం విషయంపై చర్చ జరగలేదు” అని ఆయన స్పష్టం చేశారు. “మన ప్రధాని సహజంగా అలాంటి ఈవెంట్లకు వెళ్లరనే విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేక ప్రతినిధులనే భారత్ పంపుతుంటుంది. రాహుల్ రాజకీయ ఉద్దేశాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు విదేశాల్లో మన దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి” అని జైశంకర్ హితవు చెప్పారు.
రాహుల్ గాంధీ వాస్తవానికి పార్లమెంటులో ఈ విషయాలు ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించాల్సిందిగా కోరేందుకు విదేశాంగ మంత్రి పలుమార్లు అమెరికా వెళ్లారని ఆరోపించారు. మనకంటూ ఒక ఉత్పత్తి వ్యవస్థ, సొంత టెక్నాలజీ ఉంటే అమెరికా అధ్యక్షుడే ఇక్కడకు వచ్చి ప్రధానిని ఆహ్వానిస్తారని వ్యాఖ్యానించారు. దేశంలో ఉత్పత్తి, సాంకేతికరంగాలపై భారత్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలోనే తప్పుపట్టారు. దేశ ప్రధాని గురించి ప్రతిపక్ష నేత ఇలాంటి నిరాధార ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. రెండుదేశాల మధ్య సంబంధాలకు చెందిన అంశంపై సరైన నిర్ధారణ లేకుండా మాట్లాడటం సరికాదని అంటూ అభ్యంతరం తెలిపారు.
వాస్తవానికి గతంలో కూడా రాహుల్ గాంధీ.. దేశ పరువును తాకట్టు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మరోసారి అదే నైజం ప్రదర్శించారు.