ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారుతున్న సమయంలో అధికార యంత్రాంగంలో తీవ్ర కలకలం నెలకొంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను పక్కకు పంపిస్తున్నారు. ఇదే సమయంలో కీలకమైన ఫైల్స్ , డాక్యుమెంట్లను ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు.
వైసీపీకి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవు పెట్టి వెళ్లారు. ఆయన పూర్తిగా వైసిపి మనిషిగా వ్యవహరిస్తున్నారు అని చాలాసార్లు తెలుగుదేశం నాయకులు ఆరోపించారు ఈ క్రమంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరగాల్సి ఉంటుంది. జవహర్ రెడ్డి సీఎస్ గా కొనసాగితే సచివాలయంలో వైసిపి పట్టు ఉంటుంది అని టిడిపి వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుచేతనే ఆయన్ని అర్జెంటుగా పక్కన పెట్టేసినట్లు సమాచారం.
సాయంత్రం లోగా కొత్త సీఎస్ను నియమించే అవకాశం ఉంది.
అధికారుల కదలికలను కూడా ఇంటెలిజెన్స్ పోలీసులు గమనిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులకు చెక్ పడే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులను రిలీవ్ చేయవద్దని ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఈ అధికారులు కొత్త ప్రభుత్వం గుప్పెట్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి వంటి అధికారుల మీద టిడిపి జనసేన నాయకులు ఇప్పటికే పోలీస్ కేసులు పెడుతున్నారు. దీన్ని బట్టి కొందరు ఉన్నతాధికారులని అరెస్టు చేయించే అవకాశం ఉందన్న మాట గుప్పుమంటోంది.
ప్రభుత్వ సలహాదారులను తొలగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు ఇప్పటికే రాజీనామా చేశారు. ఇప్పటివరకు రాజీనామా చేయని సలహాదారులను తొలగించాలని ఆదేశించింది.
దీంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తంలో కలకలం రేగుతోంది